యువత చేతిలోనే దేశభవిత
జిల్లాపరిషత్ సీఈఓ నాగమ్మ
కడ్తాల : విద్యార్థులు, యువకుల పైనే దేశ భవిష్యత్, అభివృద్ధి ఆధారపడి ఉన్నాయని, సమాజ సేవలో యువత పాత్ర కీలకమని జిల్లా పరిషత్ సీఈవో నాగమ్మ అన్నారు. బుధవారం కడ్తాల గ్రామంలో తమిళనాడుకు చెందిన వెంకటరామన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగరికత వేగంగా దూసుకుపోతున్న తరుణంలో యువత ఆలోచన విధానాల్లో మార్పు రావాలన్నారు.
పరిసరాలు కలుషితమయినట్లే మన ఆలోచన విధానాలు కలుషితమవుతున్నాయని, మన ఆలోచన విధానం మారినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఏర్పాటుకు సహకరించిన వెంకటరామన్ను ఘనంగా సన్మానించారు.
స్వచ్ఛ భారత్లో పాల్గొన్న సీఈఓ
అనంతరం గ్రామంలో వివేక నంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పాల్గొన్నారు. ప్రధాన కూడలితో పాటు పలు కాలనీలలో చెత్తాను ఊడ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అనురాధ, ఎస్సై సాయికుమార్, ఎంఈఓ కిషన్, నాయకులు దశరథ్నాయక్, వేణుగోపాల్, వెంకటేశ్, లక్ష్మయ్య, కృష్ణయ్య, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.