రేవంత్ భద్రత బాధ్యత మీదే : హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీకి హైకోర్టు ఆదేశం
ఆయనకు 4+4 భద్రత, 24 గంటల ఎస్కార్ట్ కల్పించండి
కేసు తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్రెడ్డి భద్రత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆయనకు 4+4 భద్రత కల్పించాలని, 24 గంటల ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఈ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే భద్రత వల్ల తన కదలికలను తెలుసుకునే అవకాశం ప్రభుత్వ పెద్దలకు ఉందని రేవంత్రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో భద్రతా సిబ్బందిపై ఆయన ఏదైనా ఫిర్యాదు ఇస్తే దానిపై విచారణ జరిపి నివేదికను తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. భట్లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రాజకీయ ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో 4+4 భద్రతను కల్పించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలంటూ రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యా జ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ శేషసాయి... రేవంత్రెడ్డికి కేంద్ర బలగాలతో భద్రతను క ల్పించాలని నవంబర్ 14న కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి శుక్రవారం అప్పీల్ దాఖలు చేశారు.
లంచ్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కె. లక్ష్మణ్ ప్రధాన న్యాయ మూర్తి (సీజే) నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో ధర్మాసనం అత్యవసర విచారణకు అంగీకరించింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ వాదనలు వినిపిస్తూ వ్యక్తుల భద్రత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్నారు. అనంతరం ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర వైఖరిని అడగ్గా రేవంత్రెడ్డికి 3+3 భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యా యవాది (ఎస్జీపీ) ఎస్. శరత్కుమార్ తెలిపారు. ఇదే విషయాన్ని సింగిల్ జడ్జి వద్ద కూడా చెప్పినా ఈ విషయాన్ని పట్టించుకోకుండా రేవంత్రెడ్డి కోరినట్లు 4+4 భద్రత కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించారన్నా రు. భద్రత ఖర్చు సంగతేంటని ధర్మాసనం ప్రశ్నించగా దాన్ని రేవంత్రెడ్డే భరించాల్సి ఉంటుందన్నారు.