సకల నేరస్తుల సర్వే.. పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులు నిర్వహించిన సకల నేరస్తుల సర్వేపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలోని నేరస్తులు, నేరచరితల వివరాలు సేకరించేందుకు పోలీసులు ఇటీవల సకల నేరస్తుల సర్వేను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఇలా నేరస్తుల వివరాలు సేకరించడంపై హైకోర్టు కన్నెర్ర జేయడంతో ఇకనుంచి ఈ సర్వే చేయబోమని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి నివేదించారు. ఈ విషయంలో ఎవరైనా తమ డేటా దుర్వినియోగమైందని భావిస్తే.. తమ వద్దకు రావొచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది.
సకల నేరస్తుల సమగ్ర సర్వేలో ఇబ్బందికర ప్రశ్నలు ఉన్నాయని గతంలో హఫీజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ పోలీసు శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ సోమవారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా డీసీపీ (డీడీ, సీసీఎస్) అవినాష్ మహంతి స్వయంగా కోర్టుకు హాజరై.. అభ్యంతరకర ప్రశ్నలు సమగ్ర సర్వే నుండి తొలగిస్తున్నామని హైకోర్టుకు తెలుపారు. దీంతో న్యాయస్థానం కేసును క్లోజ్ చేసింది.