టెన్షన్.. హైదరాబాద్లో నీటమునిగిన 20 ప్రాంతాలు
సాక్షి, హైదరాబాద్ : ఉరుములతో కూడిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని వణికించింది. సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. పెద్దపెద్ద శబ్దాల ఉరుములతో కూడిన భారీ వర్షం కారణంగా అనేక కాలనీలు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. సాయంత్రం నుంచే నగరాన్ని మేఘాలు కమ్ముకుని చీకటిని ఆవరించగా, జోరుగా కురుస్తున్న వర్షం కారణంగా వరదల పరిస్థితి తలపించడంతో రోడ్లపై ట్రాఫిక్ నరక ప్రాయంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని కూడళ్లలో నడుము లోతు వరకు వర్షం నీరు చేరిపోయింది. సోమవారం సెలవు దినం కావడంతో కొంత మేరకు ట్రాఫిక్ తక్కువగానే ఉన్నప్పటికీ అనేక చోట్ల జామ్ అయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసీలో నీరు పొంగి ప్రవహిస్తోంది. అంబర్పేట ముసారాంబాగ్ బ్రిడ్జీ పైనుంచి నీరు పొంగి ప్రవహిస్తోంది.
ఈ రోజు సాయంత్రం ఆరు గంటలవరకు నమోదైన వర్షపాతం ప్రకారం రాజేంద్రనగర్ లో 8.3 సెం.మీ., అంబర్ పేటలో 7 సెం.మీ., ఆసిఫ్ నగర్ లో 6.8 సెం.మీ., గోల్కొండలో 6.8 సెం.మీ., బహదూర్ పురలో 6.7 సెం.మీ., చార్మినార్ లో 6 సెం.మీ., హయత్ నగర్ లో 6 సెం.మీ., అమీర్ పేట మైత్రీవనం వద్ద 5.6 సె.మీ., శేర్ లింగంపల్లిలో 5 సెం.మీ., వర్షపాతం నమోదైంది.
నగరంలో చెరువులుగా మారిన 20 ప్రాంతాలు
భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రాణీగంజ్ లోని బొంబే హోటల్, దారుసలామ్ ఓల్గా హోటల్ వద్ద, మలక్ పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా, కర్బాలా మైదాన్ జంక్షన్ వద్ద, బషీర్ బాగ్ కేఫె బాహార్ వెళ్లే రోడ్డు మార్గం, మెడిసిటీ హాస్పటిల్ వల్ల టాంక్ బండ్ తెలుగు తల్లి విగ్రహం వద్ద, హిమాయత్ నగర్ లోని స్ట్రీట్ నంబర్ 5, 9లలో, మలక్ పేట గంజ్ లో, మలక్ పేట బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద, బీవీబి జంక్షన్ వద్ద, సీఎం క్యాంపు కార్యాలయం వద్ద, లేక్ వ్యూ అతిథి గృహం వద్ద, పంజాగుట్ట క్రోమా ఎదుట, జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 45 లో, పుత్లీబౌలీ, కేసీపీ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, గుల్జార్ హౌస్, చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలు.. ఇలా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ రూట్లలో వాహనాల రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఈరూట్లలో గంటల తరబడి వాహన శ్రేణులు నిలిచిపోయాయి.
హైదరాబాద్ వ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాలు విస్తరించడంతో భారీ వాన కురుస్తోంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలోని నల్గొండ, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబాబాద్, యాదాద్రి, మెదక్ తదితర జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. నగరంలో ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట, పాతబస్తీలోని లాల్ దర్వాజా, ఆలియాబాద్, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, గౌలిపుర, మొఘల్ పుర, షా అలీ బండ, బండ్లగూడ, చత్రినాక, చాదర్ ఘాట్, మలక్ పేట్, సైదాబాద్, సికింద్రాబాద్, అల్వాల్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, మియాపూర్, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, అమీర్ పేట, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, నాంపల్లి దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, బేగంపేట్, సికింద్రాబాద్, ఉప్పల్, నాచారంలో భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
వర్షానికి రాణీగంజ్ వద్ద బాంబే హోటల్ ముందు నీట మునిగిన వాహనాలు - సీసీ కెమెరా ఫుటేజీని వీక్షించండి