ఇంధనం ఆవిరవుతోంది..!
మండుతున్న ఎండలకు వాహనాల్లోని 20 శాతానికి పైగా ఇంధనం ఆవిరి
రోజూ 45 లక్షల లీటర్ల పెట్రోల్, 34 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు
ట్యాంక్ ఫుల్ చేయకపోవడమే ఉత్తమం
హెచ్చరిస్తున్న ఆయిల్ కంపెనీలు
సాక్షి,సిటీ బ్యూరో: మహానగరంలో ఎండలు మండుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణతాపానికి వాహనాల్లోని ఇంధనం ఆవిరైపోతోంది. నగరంలో గతవారం రోజులుగా భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణ వేడిమి వాహనాల ఇంధనంపై ప్రభావం చూపుతోంది. ట్రాఫిక్ కారణంగా ఒక వైపు తగ్గుతున్న మైలేజీకి తోడు ట్యాంక్లో పోస్తున్న ఇంధనం వాహనాలకు ఏ మూలకు సరిపోవడం లేదు. మరోవైపు ఎండల్లో పార్కింగ్ ఇంధనంపై మరింత ప్రభావం చూపుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో వాహనాలు వేడెక్కుతున్నాయి. ట్యాంకుల్లోని ఇంధనం వేడెక్కి అవిరై గాలిలో కలుస్తోంది. దీంతో వాహనదారుల జేబులకు చిల్లు పడుతోంది.
60.34 లక్షలపైనే వాహనాలు..
గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 60.34 లక్షల వాహనాలున్నాయి. అందులో ద్విచక్ర వాహనాలు సుమారు 44.04 లక్షల వరకూ ఉంటాయి. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకుల ద్వారా ప్రతి రోజూ 45 లక్షల లీటర్ల పెట్రోల్, 34 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతిరోజు పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతోంది. ఒక్కొక్క ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతిరోజు ధరల సవరణలతో పెట్రోల్ బంకులకు వెళ్లే వినియోగదారులు అవసరాలకు మించి వాహనాల్లో పెట్రోల్, డీజిల్లను పోయించుకుంటున్నారు. దీంతో వాహనాల ట్యాంకులు ఉష్ణాతాపానికి వేడెక్కి ఇంధనం ఆవిరైపోతుంది. ప్రతిరోజు సగటు వినియోగంలో 20 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్ ఉష్ణతాపానికి ఆవిరై గాలిలో కలుస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా నింపొద్దు..
ప్రధాన ఆయిల్ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల నిల్వలపై వాహనదారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాహనాల ట్యాంక్లో సగం వరకే ఇంధనం నింపాలని, పూర్తిగా నింçపకుండా ఉంటేనే మంచిదని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ట్యాంక్ను నిండుగా నింపితే ఉష్ణతాపానికి ఆవిరై పోవడంతో పాటు ప్రమాదాలు కూడా సంభవిస్తాయని హెచ్చరిస్తున్నాయి.
సంబంధిత వార్తలు