ప్రాణం తీసిన ఈత సరదా
చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి
టేకులపల్లి : ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన లావుడ్యా సౌమన్ (13), బానోతు సిద్దూ (12), బానోతు సంతోష్ (13), బానోతు దిలీప్ (10) సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నమే తిరిగి ఇంటికి వచ్చారు. కాసేపు సరదాగా ఇంటి వద్ద ఆడుకున్న తర్వాత మూడు గంటలకు సమీపంలోని సాయమ్మ చెరువుకు ఈత కోసం వెళ్లారు.
ఒక్కొక్కరు చెరువులోకి మోకాళ్ల లోతు వచ్చే వరకు దిగారు. ఆడుకుంటూనే నీటి మధ్యలోకి వెళ్లారు. అక్కడ లోతుగా ఉండటం, ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందారు. ఆ సమయంలో చెరువులో చేపలు పట్టేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఒడ్డుపై దుస్తులు ఉండటాన్ని గమనించి నీటిలో చూసేసరికి మృతదేహాలు కనిపించాయి. ఒకేసారి నలుగురు చిన్నారులు మృతి చెందడంతో బొమ్మనపల్లిలో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ గడ్డం ప్రవీణ్కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.