మెడికల్ సిబ్బందిపై పూల వర్షం
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో త్రివిధ దళాలు చేసిన సన్మానాలు ఇపుడు కాలనీల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. కోవిడ్ సమయంలో రెడ్ జోన్లలో పనిచేస్తున్న డాక్టర్లకు, ఎఎన్ఎమ్లకు, మున్సిపల్ సిబ్బందిని స్వఛ్చంద సంస్ధ నిర్వాహకుడు గాదెరాజు బాలకృష్ణ సాయి ఘనంగా సన్మానించి సత్కరించారు. 20 రోజులుగా కంటైన్మెంట్ జోన్లో ఇంటింటికి సర్వే చేస్తున్న ఆశావర్కర్లను, ఎఎన్ఎమ్లు, మున్సిపల్సిబ్బందిపై పూల వర్షం కురిపించారు. లాక్డౌన్ నేపథ్యంలో వారి కుటుంబాలను వదులుకుని తమ కాలనీ వాసులకు సేవ చేయడంపై టీఆర్ఎస్ నాయకులు సర్వబాబు యాదవ్, గడ్డం రవి కృతజ్ఞతలు తెలిపారు. వారందరిని శాలువాలు కప్పి సత్కరించారు. ఇంట్లో కావాల్సిన నిత్యావసరాలను కూడా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి వారందరికి 15 రోజులకు సరిపడా నిత్యావసరాలను కూడా అందించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పల్లవి, కంటైన్మెంట్ ఇంచార్జ్ ప్రకాశ్లు పాల్గొన్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తమకు సేవలందించినందుకు జీవితాంతం వారికి రుణ పడి ఉంటామని కాలనీవాసులు చెబుతుంటే మరింతగా సేవాచేయాలని అనిపిస్తుందని, కుంటుంబాన్ని వదిలిపెట్టి కోవిడ్ సమయంలో బయటకు వచ్చిన బాధ అంత కూడా పోయిందని మెడికల్ సిబ్బంది కంటతడి పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు నిజంగా వైద్యసిబ్బంది చేస్తున్న సేవల్ని గుర్తిస్తే ఇంతకంటే జీవితంలో సంతృప్తి ఏం ఉంటుందని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు.