తగ్గిన కృష్ణమ్మ వరద
శ్రీశైలంలోకి 53,105 క్యూసెక్కులు
156 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
తుంగభద్రలో నిలకడగా వరద
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం జలాశయంలోకి ఆది వారం ఉదయం 1,06,631 క్యూసెక్కుల ప్రవాహం చేరగా.. సాయంత్రానికి 53,105 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ఇందులో తుంగభద్ర నుంచి వస్తున్న జలాలే 40 వేల క్యూసెక్కులు కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 873.4 అడుగుల్లో 156.01 టీఎంసీలు ఉన్నాయి.
కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం కుడి, ఎడమ గట్టు పవర్ హౌస్ల్లో విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు రెండు టీఎంసీలను విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఈ సీజన్లో ఇప్పటివరకు శ్రీశైలం జలాశయంలోకి 125.406 టీఎంసీలు వచ్చాయి. ఎగువన కృష్ణాలో వరద తగ్గిపోవడంతో ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి దిగువకు వదిలే ప్రవాహాన్ని కట్టడి చేస్తుండటంతో జూరాలకు వచ్చే వరద కనిష్ట స్థాయికి చేరింది. తుంగభద్రలో మాత్రం వరద నిలకడగా కొనసాగుతోంది. ఆదివారం 54,380 క్యూసెక్కులు చేరడంతో అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు సుంకేసుల బ్యారేజీ మీదుగా శ్రీశైలాన్ని చేరుతున్నాయి.