ఎవరి ప్రయోజనాల కోసం రైతు సంఘాలు!
రాజకీయ జోక్యం ఉండకూడదు: కోదండరాం
హన్మకొండ: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రైతు సంఘాలు ఎవరి ప్రయోజనం కోసమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. హన్మకొండలో తెలంగాణ నవ నిర్మాణవేదిక ఆధ్వర్యంలో ‘వ్యవసాయ సంక్షోభం– కారణాలు– పరిష్కారం’ అంశంపై ఆదివారం జరిగిన సదస్సు లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రైతు సంఘాలు ఓట్ల కోసం పని చేస్తాయా.. రైతు సమస్యలపై పనిచేస్తాయా.. అని ప్రశ్నించారు. రైతు సంఘాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కావాల్సిన మేర కేటాయింపులు లేవన్నారు. రైతులకు ప్రయోజనంలేని పాలీహౌస్లకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు.
వీటి స్థానంలో చిన్నచిన్న పనిముట్లు ఇస్తే బాగుంటుంద న్నారు. వ్యవసాయ కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఇజ్జత్గా బతికే పరిస్థితులు లేవన్నారు. అప్పుల కోసం బ్యాంకులకు వెళ్లే రైతులను బ్యాంకర్లు చిన్నచూపు చూస్తున్నారని, గట్టిగా మాట్లాడినా, ప్రశ్నించినా గెంటివేస్తున్నట్లు రైతులే చెబుతున్నారని కోదండరాం తెలిపారు. హైదరాబాద్లో ఈ నెల 17 నుంచి 28 వరకు స్వేచ్ఛా వాణిజ్య విధానంపై అంతర్జాతీయ సమావేశం జరగనుందన్నారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం అనే ఒప్పందంపై సదస్సు ఉంటుందని, 16 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ఈ ఒప్పందంతో ఇక్కడి రైతులకు ఎంతో నష్టం జరగుతుందన్నారు.