గుట్టకు ఏటా రూ.100 కోట్లు: కేసీఆర్
యాదగిరిగుట్టను వాటికన్ సిటీలా మారుస్తామని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆ దిశగా మరో అడుగువేశారు. ఇకనుంచి గుట్టకు ప్రతి ఏటా రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత వార్షిక బడ్జెట్ లో యాదగిరి గుట్ట అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.
బుధవారం యాదగిరిగుట్టలో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులపై అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. రాయగిరి నుంచి గుట్టకు నాలుగు లేన్ల రహదారిని నిర్మించడంతోపాటు గుట్టకు నాలుగువైపుల ఉన్న రోడ్లను తక్షణమే అభివృద్ధి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. గుట్ట చుట్టూ సుగంధం వెదజల్లేలా మొక్కలు పెంచాలని అటవీశాఖ అధికారులకు, రాయగిరి, యాదగిరిగుట్టలోని చెరువులను మిషన్ కాకతీయలో భాగంగా అభివృద్ధి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచనలు చేశారు. గర్భగుడి వెనుక భారీ ఆంజనేయ విగ్రహం ఏర్పాటు, ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణంపై దేవాదాయ శాఖ, గుట్ట ఆలయ అధికారులతో సమాలోచనలు జరిపారు.