కరోనా సోకితే చనిపోతారనేది అపోహ: ఈటల
రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదు: మంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి రెండుసార్లు కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. దీంతో త్వరలోనే అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతూ.. కరోనా వైరస్ సోకితే చనిపోతారనేది అపోహగా కొట్టిపారేశారు. దీని వల్ల డెత్రేట్ మూడు శాతం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. దీనికి ప్రత్యేకంగా మందులు లేవని, కానీ పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. (ఉస్మానియాలోనూ ‘కోవిడ్’ నిర్ధారణ పరీక్షలు)
మరో మూడు ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు
శాస్త్రవేత్తలు త్వరలోనే దీనికి మందులు, వ్యాక్సిన్లు కనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో ఎవరూ భయపడవద్దని సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లను స్క్రీనింగ్ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కోవిడ్ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు మరో మూడు ల్యాబ్స్కు కేంద్రం అనుమతిచ్చిందన్నారు. ఇప్పటికే గాంధీ, ఉస్మానియాలో టెస్టులు జరుగుతున్నాయని, కొత్తగా కాకతీయ మెడికల్ కాలేజీ, ఐపీఎం(ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్), ఫీవర్ ఆసుపత్రులకు అనుమతులు లభించాయని పేర్కొన్నారు. కరోనా ట్రీట్మెంట్ జరిగే ఆసుపత్రుల్లో ఎఫ్ఆర్ ఫిల్టర్స్ పెడుతున్నామని వెల్లడించారు. (తెలుగులోనూ కోవిడ్ కాలర్ ట్యూన్)