970కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణతో కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్లో 13, జోగులాంబ గద్వాల్లో 10 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 970కి చేరింది. కరోనా వైరస్ కారణంగా గురువారం ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృత్యువాతపడ్డ వారి సంఖ్య 25కి పెరిగింది. ఇక కోవిడ్-19 నుంచి కోలుకుని 262 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 693 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
వైద్యులందరికి అన్ని సౌకర్యాలతో రక్షణ పరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్క్లతో కలిపి మొత్తం నాలుగున్నర లక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. గచ్చిబౌలి హాస్పిటల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని ఈటల తెలిపారు. ఇక రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లలో తప్పా ఇతర ప్రాంతాల్లో కేసులు రావడం లేదని, మరో 5,6 రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. 108 అంబులెన్స్లు ఎక్కడైనా అందుబాటులో లేకపోతే ప్రైవేటు వాహనాలను వాడుకోవాలని సూచించారు. 104,108 సేవలు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఈటల తెలిపారు.