పదో తరగతిలో 9 పేపర్లు !
* విద్యాశాఖ సంస్కరణల ప్రతిపాదనల్లో మార్పులు
* భాషలకు ఒకటి.. సబ్జెక్టులకు రెండు పేపర్లు
* 35 శాతం మార్కులు సాధిస్తే పాస్
* 9వ తరగతిలోనూ అదే విధానం
* వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో (2014- 15) తొమ్మిది పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ మార్పులు చేస్తోంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండగా.. వాటిని 7 పేపర్లుగా (అన్నీ ఒక్కో పేపరు, సైన్స్లో 2 పేపర్లుగా) చేయాలని మొదట్లో ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ఇటీవల వివిధ ఉపాధ్యాయ సంఘాలతో చర్చల అనంతరం సంస్కరణల ప్రతిపాదనల్లో పలు మార్పులు చేస్తోంది. ముఖ్యంగా 9 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చింది. భాష(ప్రథమ, ద్వితీయ, తృతీయ)లు ఒక్కో పేపరుగా, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు రెండు పేపర్లుగా పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదనలు చేస్తోంది.
అంతేకాదు పదో తరగతికి ముందే విద్యార్థులు ఈ పరీక్ష విధానానికి అలవాటు పడాలనే ఉద్దేశంతో 9వ తరగతిలోనూ ఈ సంస్కరణలు అమలు చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) భావిస్తోంది. పాస్ మార్కులు 40 శాతం కాకుండా 35 శాతమే ఉండేలా మార్పులు చేస్తోంది. వీటిపై ఈనెల 3న ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయానికి రానుంది. ఆ తరువాత ప్రభుత్వ ఆమోదం కోసం పంపించేలా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2 తరువాత ఏర్పడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వీటి అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నాయి.
ఇదీ పేపర్ల స్వరూపం, మార్కుల విధానం..
► సైన్స్లో జీవశాస్త్రం ఒక పేపరుగా, భౌతిక, రసాయన శాస్త్రాలకు మరో పేపరు ఉంటాయి.
► సాంఘిక శాస్త్రంలో భూగోళ శాస్త్రం, అర్థ శాస్త్రాలకు పేపరు-1, పౌరశాస్త్రం, చరిత్రలకు పేపరు-2 ఉంటాయి.
► గణితంలో సంఖ్యలు, సమితులు, బీజగణితం, ప్రోగ్రెషన్, కోఆర్డినేట్ జామెట్రీ పేపరు-1గా, జామెట్రీ, త్రికోణమితి, క్షేత్రగణితం, సాంఖ్యకశాస్త్రం పేపరు-2గా ఉంటాయి.
► ప్రతి సబ్జెక్టులో 80 శాతం మార్కులకు పబ్లిక్ పరీక్ష ఉంటుంది. మిగతా 20 శాతం మార్కులు ఇంటర్నల్స్కు ఉంటాయి.
► పబ్లిక్ పరీక్షలో రెండు పేపర్లకు కలిపి 80 మార్కులకు గాను కనీసం 28 మార్కులు వస్తేనే పాస్. ఇంటర్నల్స్లో రెండు పేపర్లకు కలిపి కనీసం 7 మార్కులు రావాలి. అపుడే మొత్తం 35 శాతం మార్కులతో పాస్ అయినట్లు.