తహతహ

Early Elections In Telangana Medak - Sakshi

సాక్షి, మెదక్‌: ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. ప్రస్తుతం జిల్లాలో సొంతంగా ఎన్నికల బరిలో దిగితే ప్రభావం చూపలేని పరిస్థితి ఉంది. దీంతో పొత్తులపైనే తెలుగు తమ్ముళ్లు ఆశలు పెంచుకుంటున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని ఇప్పటికే ప్రకటించాయి. సీపీఎం బీఎల్‌ఎఫ్‌ జెండాపై పోటీచేస్తామని చెబుతుంది. సీపీఐ వారితో జతకట్టే అవకాశం కూడా లేకపోలేదు. తెలంగాణలో ఇంకా ఏ పార్టీ తమతో జతకట్టే పరిస్థితి లేదన్న భావన టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. దీంతో టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ పార్టీతో జతకడితే ఇరుపార్టీలకు లాభిస్తుందన్న భావన దేశం నేతల్లో వ్యక్తం అవుతోంది. జిల్లా నేతలు ఇటీవల పొత్తుపై తమ మనోగతాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రమణ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.  టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

దీంతో స్థానిక నేతలు పొత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో టీడీపీ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేసి గెలిచే అవకాశాలు దాదాపుగా లేవు. దీనికితోడు పార్టీకి చెందిన కొంత మంది ముఖ్యనేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు.  ఇటీవలే నర్సాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రఘువీరారెడ్డి సైత బీజేపీలో చేరిన విషయం విధితమే. కానీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీకి కేడర్‌ ఇంకా ఉంది. అయితే కేడర్‌ను సమన్వయం చేసే ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం యాక్టివ్‌గా కనిపించటంలేదు. దీంతో ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగితే పరాభావం తప్పకపోవచ్చన్న భావన టీడీపీ నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంటే లాభిస్తుందని జిల్లా టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇదే విషయాన్ని అదిష్టానానికి చెబుతూ ఎలాగైనా పొత్తు కుదర్చుకోవాలని వత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల 28, 29 తేదీల్లో టీడీపీ ముఖ్యనేతల సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. టీడీపీ అధ్యక్షుడు రమణతో జరిగే సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు.

మెదక్‌ నియోజకవర్గంపైనే గురి
కాంగ్రెస్, టీడీపీ నడుమ “పొత్తు’ పొడిచిన పక్షంలో మెదక్‌ నియోకజవర్గం టికెట్టు దక్కించుకోవాలని టీడీపీ నేతలు పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.  నర్సాపూర్‌తో పోలిస్తే మెదక్‌ నియోజకవర్గంలో టీడీపీ కొంత నాయకత్వం బలంగా ఉంది. నర్సాపూర్‌లో కాంగ్రెస్‌ బలంగా ఉండగా మెదక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలున్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు ఎత్తిచూపులని ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేతలు ఏకతాటిమీద లేనందున ఆ స్థానం టీడీపీకి వదిలేయాలని కాంగ్రెస్‌ను కోరతామని టీడీపీ జిల్లా నాయకుడు ఒకరు తెలిపారు. మెదక్‌ ఎమ్మెల్యే బరిలో దిగాలని టీడీపీ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఏ.కె.గంగాధర్‌రావు, తెలుగు యువత అధ్యక్షుడు బొజ్జ పవన్‌కుమార్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇద్దరూ పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే లాభమన్న భావన ఇరు నేతల్లోనూ వ్యక్తం అవుతోంది. అయితే తెలుగు తముళ్లు ఆశిస్తున్నట్లుగా పొత్తు కుదురుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్‌ జిల్లా నేతలు పెద్దగా స్పందించడం లేదు. టీడీపీ పొత్తు కుదిరే అవకాశాలు లేవని, ఒకవేళ కుదిరినా మెదక్‌ సీటును వదులుకునే ప్రసక్తేలేదని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. మెదక్, నర్సాపూర్‌లో టీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో ఓడించాలంటే కేవలం కాంగ్రెస్‌ వల్లే సాధ్యమని కాంగ్రెస్‌ నాయకులు  చెబుతున్నారు.

అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌..
ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే విషయంలో జిల్లా నాయకులు, కార్యకర్తల్లో ఆసక్తి కనపిస్తోంది. అయితే పొత్తు విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏ.కె.గంగాధర్‌ అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపై ఆయన స్పందిస్తూ  పొత్తుపై పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలిపారు. ఈ చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని త్వరలోనే అధిష్టానం ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే మెదక్‌ సీటు కోరతామని ఆయన స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top