రేపటి నుంచి తెలంగాణ ఎంసెట్
హైదరాబాద్: తెలంగాణాలో రేపటి నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం కానుంది. మే 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్, మే 8,9 తేదీల్లో అగ్రికల్చర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నాం 3 నుంచి 6 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఎంసెట్ పరీక్ష ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య కన్నా కంప్యూటర్లు తక్కువగా ఉండటంతో విడతల వారీగా ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. మొత్తం 2 లక్షల 17 వేల 199 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేశారు.
ఇందులో ఇంజనీరింగ్కు లక్షా 42 వేల 218 మంది విద్యార్థులు, అగ్రికల్చర్, ఫార్మసీకి 74 వేల 981 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. రెండింటికీ 235 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో ఐదుగురు ట్రాన్స్జెండర్లు కూడా ఉన్నారు. ఇంజనీరింగ్కు నలుగురు, అగ్రికల్చర్కు ఒక ట్రాన్స్జెండర్ దరఖాస్తు చేశారు. తెలంగాణాలో 15, ఆంధ్రాలో 3 రీజినల్ సెంటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 94 కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు.