13కు చేరిన రిమ్మనగూడ మృతుల సంఖ్య
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి: హరీశ్
గజ్వేల్/గాంధీ ఆస్పత్రి: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. తుప్రాన్ మండలం వెంకటరత్నాపూర్కు చెందిన ఇలిటమ్ నర్సింహులు (38), కరీంనగ ర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటకు చెందిన కల్లెపు రాజిరెడ్డి(63) చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు.
గాయపడిన శ్రీకాంత్కు కాలేయ సంబంధ సమస్య ఏర్పడటంతో శస్త్ర చికిత్స నిర్వహించామని, లక్ష్మీకి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని గాంధీ వైద్యులు తెలిపారు. వినయ్, శృతి, పుష్పలతలను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించామన్నారు. శనివారం జరిగిన ప్రమాదంలో మొత్తం 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.
బాధితులకు అండగా మంత్రి హరీశ్రావు
ప్రమాద బాధితులకు మంత్రి హరీశ్రావు అండగా నిలిచారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్న తీరును పర్యవేక్షించారు. ప్రమాదంలో మొత్తం 30 మంది గాయపడగా.. అందులో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
హరీశ్రావు ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స కోసం వారిని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఆస్పత్రికి వెళ్లిన మంత్రి చికిత్స పొందుతున్న వారిని కలుసుకొని నేనున్నా అని ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వర్గాలను ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి మహేందర్రెడ్డి పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. మంత్రి వెంట ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, ఎండీ రమణరావు ఉన్నారు.