ఆదివాసీ, గిరిజనుల సమస్యలపై అఖిలపక్షం
కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ డిమాండ్
హైదరాబాద్: ఆదివాసీలు, గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలు, గిరిజనుల మధ్య సంఘర్షణలకు టీఆర్ఎస్ పాలనే కారణమని ధ్వజమెత్తారు. ప్రపంచ తెలుగు మహాసభలు ప్రభుత్వ కార్యక్రమాలుగా మారడం మంచిది కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు సరైన గౌరవం ఇవ్వడంలేదన్నారు.
బీసీలపై చిన్నచూపు: బీసీలను టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని దత్తాత్రేయ ఆరోపించారు. బీసీల సమస్యలను వివరిస్తూ సీఎం కేసీఆర్కు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ నియామకాల్లో బీసీల రిజర్వేషన్ల అమలు చట్టబద్ధంగా జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్ని పరిశ్రమను తిరిగి పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. బీసీ విద్యార్థులకు 8వ తరగతి నుంచి ఐటీఐలో సాంకేతిక విద్యను అందించాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందన్నారు. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ గెలుస్తుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక, ఒడిశాల్లోనూ బీజేపీ విజయం తథ్యమని జోస్యం చెప్పారు.