వేధింపులకు వేదిక
పెరుగుతోన్న సోషల్ మీడియా బాధితులు
మిత్రులు, బంధువులు, పోలీసు ఆఫీసర్లు, భార్యలనూ వదలడం లేదు
వ్యక్తిగత కక్షతో అసభ్యకర ఫొటోలు, సందేశాలతో పోస్టులు
ప్రతిష్టను దిగజారుస్తూ జైలు పాలవుతున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 30కి పైగా కేసులు
ఓ సీనియర్ పోలీసు అధికారిణి పేరుపైనే మల్టిపుల్ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించి ఆమె అధికారిక ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టులు చేస్తూ వేధిస్తున్న గుర్తు తెలియని వ్యక్తిపై ఇటీవల నగర సైబర్క్రైమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు టెక్నికల్ డాటా ఆధారంగా నిందితుడు కృష్ణా జిల్లాకు చెందిన కునపారెడ్డి మన్మోహన్ ను గుర్తించి మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు.
ఈసీఐఎల్లోని రాథికా థియేటర్లో ప్రొజెక్టర్ అపరేటర్గా పనిచేస్తున్న జాన్ జార్జ్ అలియాస్ సన్నీ దమ్మాయిగూడలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే భార్యతో మనస్పర్థలు రావడంతో ఆమె ప్రతిష్టను దిగజార్చేందుకు ఆమె తన స్నేహితులతో కలిసి ఉన్న గ్రూప్ ఫొటోను షేర్చాట్లో షేర్ చేశాడు. వీరు కాల్గరల్స్ అంటూ బాధితురాలి ఫోన్ నంబర్ను ఇచ్చి కామెంట్లతో పాటు వాయిస్ ఇవ్వడంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్కాల్స్ వచ్చాయి. దీనిపై బాధితురాలు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్నికల్ డాటా ఆధారంగా నిందితుడు జాన్ జార్జ్ను రెండురోజుల క్రితం అరెస్టు చేశారు.
సాక్షి, సిటీబ్యూరో: ఈ రెండు కేసుల్లోనే కాదు ఇటీవలి కాలంలో సైబర్క్రైమ్ పోలీసు స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో ఆన్లైన్ వేధింపులే ఎక్కువగా ఉంటున్నాయి. పాఠశాల విద్యార్థినుల నుంచి మహిళల వరకు బాధితులుగా ఉంటున్నారు. స్నేహంగా ఉంటూనే పక్కనున్న వారే కొంతరు వక్రబుద్ధి చూపిస్తుండగా... ఆన్లైన్లో పరిచయమై స్నేహంగా ఉంటూనే నమ్మకాన్ని పెంచుకుని ప్రేమ, పెళ్లి ప్రస్తావన చేయడం, తీరా అది నెరవేరకపోతే తమలోని అసలు రూపాన్ని బహిర్గతం చేస్తున్నారు. ఇలా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు నెలరోజుల వ్యవధిలో 30కిపైగా ఈ తరహా ఫిర్యాదులు అందడం గమనార్హం.
భార్యలనూ వదలడం లేదు..
ఆన్లైన్లో వేధింపులకు గురవుతున్న వారిలో అత్యధికులు విద్యార్థినులు, ఉద్యోగిణులే ఉంటున్నారు. రోజూ గంటలకొద్దీ సెల్ఫోన్ చేతిలో పెట్టుకొని సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలడం కూడా వీరు వేధింపుల వలలో చిక్కుకునేందుకు కారణమవుతోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వస్తున్న ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. అమ్మాయి పేరుతోనే ఆ ఫేస్బుక్ ఐడీలు ఉండటంతో నమ్మిన విద్యార్థినులు, అమ్మాయిలు, యువతులు యాక్సెప్ట్ చేసిన తర్వాత అమ్మాయిగానే చాట్ చేయడం మొదలెడుతున్నారు సైబర్ స్టాకర్స్. మెల్లమెల్లగా వ్యక్తిగత విషయాలు, వారి హబీలు, వారి టూర్ ఫొటోలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత తాము చెప్పినట్లు చేయాలని లేకపోతే వ్యక్తిగత ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని బెదిరిస్తున్నారు. అలా వారు అడిగినట్లుగా డబ్బులు ఇస్తూనే వేధింపులకు గురవుతున్నారు. కొన్నిసార్లు లైంగిక వాంఛ తీర్చాలని ఒత్తిడి చేస్తున్నారు.
కొందరు ఈ విషయాలను తల్లిదండ్రులకు చెబుతుండటంతో పోలీసులకు ఫిర్యాదులు అంది నేరగాళ్లకు చెక్పెడుతున్నారు. అలాగే వివిధ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు కాలేజీ రోజుల్లో స్నేహంగా ఉన్న ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేస్తే తిరస్కరించిన వారూ ఆ రోజుల్లో వారు సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వేధిస్తున్నారు. ఇటీవల మహిళా పోలీసులపై అక్కసుతో పాటు వారి ప్రతిష్టను దిగజార్చే విధంగా బాధితుల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలతో పోస్టు చేస్తున్నారు. ఇలా విద్యార్థినులు, మహిళలు, ఉద్యోగిణులు, మహిళా పోలీసులు వేదనకు గురవుతున్నారు. మరికొందరు కుటుంబసభ్యులనే టార్గెట్ చేస్తున్నారు. సొంత భార్యనే కాల్గర్ల్ అంటూ షేర్చాట్లో పోస్టులు పెట్టి వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తున్నారు. వేధింపులకు గురైనవారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
వెంటనే ఫిర్యాదు చేయాలి..
సోషల్ మీడియాలో వేధింపులకు గురైన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఏమంటారనో విషయాన్ని దాచిపెట్టవద్దు. అలాచేస్తే చివరకు సూసైడ్ వరకు వెళ్లవచ్చు. మీరు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినా మీ పేర్లు గోప్యంగా ఉంచుతాం. సైబర్ స్టాకర్ల ఆటకట్టిస్తాం. ఇలాంటి సైబర్ క్రైమ్స్ను నిలువరించాలంటే చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరముంది. –మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్