నీ వెంటే నేను..

couple died in karimnagar district - Sakshi

భర్త మరణం తట్టుకోలేక భార్య మృతి

18 రోజుల వ్యవధిలో దంపతులు మృతి

తిమ్మాపూర్‌లో విషాదం   

ధర్మపురి: ఇంటి పెద్ద మృతిచెంది 18 రోజులైంది. పెద్దకర్మ చేసి వారం గడిచింది. ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అంతలోనే ఇంటి ఇల్లాలు మృతి చెందడం కుటుంబంలో తీరని దు:ఖాన్ని మిగిల్చింది. భర్త మరణం తట్టుకోలేక బీపీ పెరిగి ఆస్పత్రికి తరలిస్తుండగా భార్య మృతి చెందింది. పక్షంరోజుల్లో దంపతులిద్దరూ మృతిచెందిన ఈ విషాద సంఘటన ధర్మపురి మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగిన పిల్లలను ఓదార్చడం ఎవరితరమూ కావడంలేదు. వివరాలు ఇలా ఉన్నాయి.. తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన కటుకం తిరుపతి కళావతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. కూతుళ్లకు వివాహం చేశారు. 

కొడుకులు తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఉపాధికోసం దుబాయ్‌ వెళ్లారు. నవంబర్‌ 16న ఇంటి పెద్ద కటుకం తిరుపతి(50) గుండెపోటుతో మృతి చెందాడు. నాటి నుంచి కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగారు. పెద్ద కర్మచేసి వారం గడవక ముందే భార్య కటుకం కళావతి(45) భర్త మరణం తట్టుకోలేక హైబీపీ రాగా  సోమవారం ధర్మపురి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జగిత్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పక్షంరోజుల్లో అటు తండ్రి ఇటు తల్లి మృతి చెందడంతో పిల్లలు శోకసంద్రంలో మునిగారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top