తెలంగాణలో మరో 920 మందికి కరోనా
రాష్ట్రంలో 11,364కి చేరిన కేసుల సంఖ్య
ఐదుగురు మృతి.. 230కి పెరిగిన మరణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 3,616 మందికి పరీక్షలు చేయగా 920 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 11,364కి చేరింది. ఇందులో 6,446 మంది వివిధ ఆస్పత్రులు, హోంక్వారంటైన్లలో చికిత్స పొందుతుండగా.. 4,688 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గురువారం కరోనాతో ఐదుగురు మరణించగా.. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 230కి పెరిగింది.
రాష్ట్రంలో మొత్తం 70,934 మందికి పరీక్షలు చేయగా.. 59,570 మందికి నెగిటివ్ వచ్చింది. ఇదిలా ఉండగా గురువారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 737 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్ జిల్లాలో 60, కరీంనగర్ జిల్లాలో 13, సిరిసిల్లలో 4, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో 3 చొప్పున, ములుగు, వరంగల్ అర్బన్, మెదక్ జిల్లాల్లో రెండు చొప్పున, వరంగల్ రూరల్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో 34 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం 17,081 బెడ్లు సిద్దం చేయగా.. ప్రస్తుతం 1,083 బెడ్స్లో రోగులు ఉన్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రైవేటులో అసాధారణంగా...
ప్రైవేటు ల్యాబ్లలో కరోనా వైద్య పరీక్షల ఫలితాలు అసాధారణ స్థితిలో నమోదవుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ భావిస్తోంది. తాజాగా ఆయా ఆస్పత్రులు పోర్టల్లో ఫలితాలు అప్లోడ్ చేయడంతో ఈ విషయం గుర్తించింది. పరీక్షలు చేయడంలో సాంకేతిక లోపాలతో ఈ పరిస్థితి వచ్చిందేమోనని ఆ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ప్రైవేటు ల్యాబ్లలో తనిఖీలు చేయాలని నిపుణుల బృందాన్ని ఆదేశించింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు చేస్తున్నారా.. లేదా? మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది? పరీక్షలు నిర్వహిస్తున్నవారు శిక్షణ పొందిన అనుభవజ్ఞులా కాదా..? అనే అంశాలను ఆ బృందం పరిశీలిస్తుంది. అనంతరం అది ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో మరొకరికి కరోనా
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటీవల ఐదో అంతస్తులోని ఓ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్కు కరోనా వచ్చింది. దీంతో ఆ ఆపరేటర్ పనిచేసే విభాగంలోని అధికారి పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు గురువారం నిర్ధారణ అయింది. అలాగే జీహెచ్ఎంసీ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎస్బీఐలోని ఓ అధికారికి కూడా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.