ఆచితూచి..!

Congress Party Over MPTC ZPTC Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థిత్వాల ఖరారుపై కాంగ్రెస్‌ పార్టీ ఆచితూచి వ్యహరిస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన తర్వాత.. కారెక్కని వారి కోసం అన్వేషిస్తోంది. ఇప్పటికే వలసల భయం పట్టుకోగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి వారికే బీ–ఫారాలు ఇవ్వాలని నిర్ణయించింది. గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించకుండా వారి నుంచి బాండ్‌ రాయించుకోవాలని ఇటీవల అధిష్టానం ఆలోచించింది. అయితే న్యాయపర ఇబ్బందులు ఎదురవుతుందనే ఉద్దేశంతో వెనకడుగు వేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ మండల అధ్యక్షులు, నాయకులతో కమిటీలు ఏర్పాటు చేసింది. వారు మూడు రోజులుగా ఆయా మండలాల్లోని ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి డీసీసీలకు అప్పగించారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక్కో స్థానం నుంచి  ఇద్దరు, ముగ్గురు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇంకా పలు మండలాల నుంచి దరఖాస్తులు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే వచ్చిన వాటిని ఆయా కమిటీలు పరిశీలిస్తున్నాయి. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ఒకరోజు ముందు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించేలా డీసీసీ అధ్యక్షులు కసరత్తు ముమ్మరం చేశారు.

వలసలపై కలవరం!
కాంగ్రెస్‌ పార్టీ నేతలకు వలసల భయం పట్టుకుంది. ఇప్పటికే 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చాలా మంది గులాబీ కండువా కప్పుకొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 64 జెడ్పీటీసీ స్థానాలుంటే కాంగ్రెస్‌ 28, టీఆర్‌ఎస్‌ 25, టీడీపీ 9 బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో కొలువుదీరిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు ఇరవైకి పైగా మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితోపాటు ఎంపీపీలు సైతం గులాబీ కండువా కప్పుకొన్నారు. ధన్వాడ జెడ్పీటీసీ సభ్యురాలు కవిత, అనితాబాల్‌రాజ్‌ (కోస్గి), లక్ష్మీవెంకటయ్య (నర్వ), ప్రకాశ్‌రెడ్డి (ఊట్కూ రు), లలిత మధుసూధన్‌రెడ్డి (మాగనూరు), సుధాపరిమళ (బిజినేపల్లి), భాస్కర్‌ (మల్దకల్‌) తోపాటు ఇంకొందరు టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే వనపర్తి ఎంపీపీ శంకర్‌నాయక్, జానకీరాంరెడ్డి (గోపాల్‌పేట), పద్మమ్మ (ఊట్కూరు), జి.హన్మంతు (మక్తల్‌), మునియమ్మ (నర్వ) సైతం కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే.. వందలాది స్థానాల్లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన ఎంపీటీసీ సభ్యుల్లో కొందరు ఆ తర్వాత పార్టీని వీడారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోనే ఏకైక స్థా నం కొల్లాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి సైతం నెల రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎదురులేని శక్తిగా ఉన్న ఆ పార్టీ ప్రస్తుతం నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోంది. దీనికితోడు అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌కు ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పుడు ఆశించిన మేరకు స్థానాలు సాధించలేకపోతే  పార్టీ మనుగడే ప్రశ్నార్థకం కానుంది. దీంతో అభ్యర్థిత్వాల ఖరారును డీసీసీలకే టీపీసీసీ అప్పగించింది. క్షేత్రస్థాయిలో పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి వారినే బరిలో దింపడంతోపాటు వారి గెలుపునకు సహకరించాలని అధిష్టానం డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఎలా ఢీ కొంటుంది? ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top