హైదరాబాద్లో మరో ఖాకీ నిర్వాకం
హైదరాబాద్ : హైదరాబాద్లో మరో ఖాకీ నిర్వాకం బయటపడింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వివాహిత జ్యోష్ణ అనే ఓ మహిళను జవహర్ నగర్ పీఎస్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నర్సింహులు ట్రాప్ చేశాడు. ఈ విషయం జ్యోష్ణ భర్త సతీష్కు తెలియడంతో ఆమెను మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్ఐ నర్సింహులు ఏకంగా సతీష్ను బెదిరించాడు. దీంతో ఎస్ఐపై మల్కాజిగిరి డీసీపీ ఉమ మహేశ్వర శర్మకి ఆయన ఫిర్యాదు చేశారు. తన భార్యతో ఎస్ఐ వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను విడాకులు ఇవ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నాడని సతీష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నర్సింహులు క్రెడిట్ కార్డుతో తన భార్య షాపింగ్ కూడా చేసిందని సతీష్ తెలిపారు. తన భార్యను ట్రాప్ చేసి అడ్డంగా దొరికి పోవడంతో తనపైనే ఎస్ఐ ఆరోపణలు చేస్తున్నాడని సతీష్ అన్నారు. ఎస్ఐ నర్సింహులు నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చిన నర్సింహులును కఠినంగా శిక్షించాలని సతీష్ డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు ఎస్ఐ నర్సింహులును హెడ్ క్వార్టర్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.