బీజేపీ, కాంగ్రెస్ పార్టీల డిపాజిట్లు గల్లంతు
మాజీ మంత్రి హరీశ్రావు
రామచంద్రాపురం (పటాన్చెరు): లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల డిపాజిట్లు గల్లంతవుతాయని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం మెదక్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా వేముల గ్రామంతోపాటు హత్నూర మండలం మల్కాపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో హరీశ్రావు మాట్లాడారు. గరీబీ హఠావో నినాదంపై రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. గరీబీ హఠావో అనే నినాదంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పుణ్యమా అని దేశం నేటికీ పేదరికంలోనే ఉందని ఎద్దేవా చేశారు. పేదరికాన్ని నిజంగా నిర్మూలిస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆరే అని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 పెన్షన్ ఇస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని పెంచారని గుర్తు చేశారు. ఏప్రిల్ 11న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.