ఆటో గుర్తు మాయం
సాక్షి, కాజీపేట: ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు కేటాయించే ఆటో గుర్తును ఈ దఫా తొలగిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. కారు.. ఆటో.. రెండూ ఒకే పోలికలతో ఉండే ఎన్నికల గుర్తులు కొన్నిసార్లు కారు అనుకుని ఆటోకు, ఆటోగా భావించి కారుకు ఓటేసిన వారు చాలామంది ఉన్నారు. ఎక్కువగా నిరాక్షరాస్యులైన ఓటర్లే ఈ రకమైన తడబాటుకు గురైనట్లుగా పలు ఉదంతాలు వెలుగుచూశాయి. ఈ రెండు గుర్తుల్లో కొంచెం మాత్రమే తేడా ఉండడం అసలు సమస్యకు కారణంగా చెప్పొచ్చు. కొద్దిపాటి తేడాలతోనే అభ్యర్థులు ఓడిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి అయోమయం ఓటర్లకే కాకుండా అభ్యర్థులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది.
ఆటో గుర్తు వల్ల కలుగుతున్న నష్టంపై టీఆర్ఎస్ అధిష్టానం ఫిర్యాదు మేరకు పరిశీలించి తొలగించినట్లుగా ఎలక్షన్ అధికారులు చెబుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనేకమంది స్వతంత్ర అభ్యర్థులకు ఆటో గుర్తు కేటాయించడంతో కారుగుర్తుకు ఎక్కువగా నష్టం జరిగినట్లుగా ఫలితాల తర్వాత వెల్లడయింది. ఆటో గుర్తుతో పోటీ చేసిన అనేకమంది అభ్యర్థులకు వేల ఓట్లు రావడం ఇందుకు కారణం. ఈ దఫా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఆటో గుర్తును రెండు తెలుగు రాష్ట్రాల్లో కేటాయించకూడదని ఎన్నికల కమిషన్ కిందిస్థాయి అధికారులకు సూచనలు చేసింది.