‘డబుల్’ ఆశలు ఆవిరేనా?
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కుప్పలుగా దరఖాస్తులు
సాక్షి, సిటీబ్యూరో: డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పేదలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా దరఖాస్తుల పరంపర కొనసాగుతుండగా కదలిక మాత్రం లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ కొత్త దరఖాస్తులు మరింతగా వెల్లుÐవెత్తుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అధికారికంగా ఎలాంటి దరఖాస్తులు ఆహ్వానించనప్పటికీ పేదలు ఆన్లైన్లో మీ సేవ, ఈ సేవ కేంద్రాలు దరఖాస్తులు చేసుకుంటున్నారు. మరోవైపు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలోనూ దరఖాస్తులు అందజేస్తున్నారు. ప్రజావాణికి దరఖాస్తుల తాకిడిని అధిగమించేందుకు అప్పటి కలెక్టర్ రఘునందన్రావు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని ఓ పత్రిక ప్రకటన ఇవ్వడంతో అప్లికేషన్లు వెల్లువెత్తాయి. స్వయంగా కలెక్టర్ సూచించడంతో దరఖాస్తుదారులు మీ సేవ, ఈ సేవ కేంద్రాలకు క్యూ కట్టారు. అదే అదనుగా కేంద్రాల నిర్వాహకులు చార్జీల రూపంలో అందినకాడికి దండుకున్నారు. తర్వాత కొద్ది రోజులకే లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడడంతో దరఖాస్తులపై స్తబ్ధత నెలకొంది. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ దరఖాస్తులు వచ్చే అవకాశముంది.
4లక్షలకు పైనే...
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రెవెన్యూ యంత్రాంగాల వద్ద సుమారు 4లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మరిన్ని కొత్త దరఖాస్తులు నమోదవుతుండడంతో కుప్పలుగా పేరుకుపోతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం మొదటి విడత కింద మురికివాడల్లోని నివాస ప్రాంతాల్లో స్థల లభ్యతను డబుల్ ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. ఇప్పటికే అక్కడి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి పొజిషియన్ సర్టిఫికెట్లు కూడా అందజేసింది. మొదటి విడత నిర్మాణాలు పూర్తయిన తర్వాత రెండో విడతలో సొంతిల్లు పేదలకు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే మొదటి విడత నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. నగరంలో రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది లక్ష్యం లక్ష ఇళ్లు కాగా సాధ్యం కాలేదు.
ఇళ్ల నిర్మాణం ఇలా...
నగరంలో స్థల లభ్యతను బట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జీ ప్లస్ 3, జీ ప్లస్ 5, జీ ప్లస్ 9 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. వీటిల్లో ఒక్కో యూనిట్కు అయ్యే ఖర్చు అంచనా వేస్తే జీ ప్లస్ 3కి రూ.7లక్షలు, జీ ప్లస్ 5కి రూ.7.75 లక్షలు, జీ ప్లస్ 9కి రూ.7.90 లక్షలు ఖర్చవుతోంది. ఇందులో ఒక్కో యూనిట్కు లక్షా యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా చెల్లిస్తోంది. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. వీటితోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు మరి కొంత ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.