ఇది మరో బ్రోకర్ వ్యవస్థ: కోదండరాం
ఇబ్రహీంపట్నం/మర్రిగూడ: రైతు సమన్వయ సమితులు మరో బ్రోకర్ వ్యవస్థ అని టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఆరోపించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఖానాపూర్, నల్లగొండ జిల్లా శివన్నగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన గ్రామ పంచాయతీలను నిర్వీర్య పరిచి.. టీఆర్ఎస్ నేతలకు పదవులను అప్పగించేందుకే రైతు సమితులను ఏర్పాటు చేస్తున్నారని విమర్శిం చారు.
రెవెన్యూ సమస్యలు, పంట సాగుకు రూ.4 వేల పెట్టుబడి, వ్యవసాయానికి సంబంధించిన ఇతర సబ్సిడీలను ఈ సమితులకు అనుసంధానం చేస్తే.. మరో బ్రోకర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీలు, గ్రామ సభ, మహిళా సమాఖ్యల ద్వారా ధాన్యం కొనుగోలు, సహకార సంఘాల సభ్యులుండగా.. సమితులు ఎందుకని ప్రశ్నించారు.
రైతు సమన్వయ కమిటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 3 నుంచి సత్యాగ్రహం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ల నిర్మాణంలో భూములను కోల్పోతున్న రైతులకు న్యాయం చేశాకే భూములు తీసుకోవాలన్నారు. శివన్నగూడెంలో డిండి చెర్లగూడెం కొన్నిరోజులుగా ధర్నా చేస్తున్న ముంపు బాధితులను ఆయన సంఘీభావం తెలిపారు.