నిషాలో నీళ్లు!

Alcohol Adultration in Hyderabad - Sakshi

మద్యం బాటిళ్లలో వాటర్‌ కలుపుతున్న వ్యాపారులు  

ఒక్కో బాటిల్‌లో 50–100 ఎంఎల్‌ వరకు  

మరోవైపు ఖరీదైన మద్యంలో తక్కువ ధర మందు కలుపుతున్న వైనం  

టెక్నిక్‌తో మూత తీస్తున్న అక్రమార్కులు  

ఎక్సైజ్‌ దాడుల్లో బయటపడిన బాగోతం  

సాక్షి, సిటీబ్యూరో: మద్యం వ్యాపారులు ధనదాహంతో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. టెక్నిక్‌తో మద్యం బాటిళ్ల మూతలు తీసి నీళ్లు కలుపుతున్నారు. ఒక్కో బాటిల్‌లో 50–100 ఎంఎల్‌ వరకు నీళ్లు కలిపి.. మళ్లీ ఎప్పటిలాగా మూత పెట్టేసి విక్రయిస్తున్నారు. వినియోగదారులు ఎవరైనా గుర్తించి ఫిర్యాదు చేస్తే తప్ప ఈ మోసాలు బయటపడడం లేదు. మద్యం కల్తీ చేసి అమ్ముతున్నారనే ఫిర్యాదుతో ఇటీవలశేరిలింగంపల్లి ఎక్సైజ్‌ అధికారులు కొండాపూర్‌లోని దుర్గా వైన్స్‌లో తనిఖీలు నిర్వహించారు. కొన్ని బాటిళ్ల నుంచి మద్యం శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేశారు. అయితే వాటిలో నీళ్లు కలిపినట్లు పరీక్షల్లో తేలింది. వెంటనే నీళ్లు కలిపిన 80 మద్యం బాటిళ్ల(ఎంసీ, బ్లెండర్‌స్ప్రెడ్, సిగ్నేచర్‌)ను తీసుకెళ్లడంతో పాటు ఆ దుకాణాన్ని సీజ్‌ చేశారు. అధికారులు గ్రేటర్‌లోని మద్యం దుకాణాలు, బార్లపై నిఘా పెడితే మరింత మంది వ్యాపారుల బాగోతం బయటపడుతుందని వినియోగదారులు పేర్కొంటున్నారు. 

రెండు రకాలుగా మోసం..  
మద్యం దుకాణాలు, బార్లలో మందుబాబులను ముఖ్యంగా రెండు రకాలుగా మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటిది బాటిల్‌ మూతను సీల్‌ పోకుండా టెక్నిక్‌గా చేతి సహాయంతో తీసి అందులో నుంచి క్వార్టర్‌ వరకు మందును తీసి మరొక బాటిల్‌లో పోసి, ఆ మేరకు నీళ్లు పోస్తున్నారు. తిరిగి యథావిధిగా వినియోగదారుడికి ఏమాత్రం అనుమానం రాకుండా మూతను బిగిస్తున్నారు. ఇక రెండో పద్ధతిలో అధిక ధరలో లభించే మద్యం సీసాల మూతను తీసి అందులో నుంచి క్వార్టర్‌ వరకు తక్కువ ధరలో లభించే మద్యం నింపుతున్నారు. పెగ్గుల రూపంలో మద్యం తాగేవారికి పై రెండు పద్ధతుల్లో తీసిన మద్యాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్సైజ్‌ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి వైన్స్, బార్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నేరాలకు పాల్పడితే సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని కొందరు తెలివిగా వ్యవహరిస్తున్నారు. రాత్రి వేళల్లో మద్యం దుకాణాలను మూసేశాక సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. 

గతంలోనూ...  
ఇలాంటి సంఘటనలు బయటపడడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిని ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లి ప్రాంతానికి చెందిన యువకులు పనిచేస్తున్నటువంటి వైన్స్, బార్‌లలో ఈ తరహా మోసాలు జరుగుతున్నాయని, గతంలోనూ ఇలా పట్టుబడిన కేసులతో వీరికే సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కానీ మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు తెలియకుండా ఈ మోసాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మద్యం బాటిళ్లలో నీళ్లు పోసినా, తక్కువ ధరలో లభించే మద్యం కలిపినా వినియోగదారులు గుర్తించడం కష్టమేనని ఎక్సైజ్‌ అధికారులు పేర్కొంటున్నారు. వాల్యూమెట్రిక్‌ అనాలసిస్‌ పరీక్ష చేస్తే తప్పా.. ఎవరూ  గుర్తుపట్టలేరని చెబుతున్నారు. అందుకే అనుమానం వస్తే వెంటనే ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.  

చర్యలు తప్పవు..  
కొండాపూర్‌లో కల్తీకి పాల్పడిన మద్యం దుకాణాన్ని సీజ్‌ చేసి విచారణ జరుపుతున్నాం. ఇలా ఎవరైనా వ్యాపారులు చేస్తే వారి లైసెన్స్‌ రద్దవుతుంది. వినియోగదారులకు అనుమానం వచ్చినట్లుయితే ఎక్సైజ్‌ అధికారులకు వెంటనే సమాచారం అందించాలి. తనిఖీలు నిర్వహించి మందులో నీళ్లు పోసినట్లు గానీ, తక్కువ ధరలో లభించే మద్యం కలిపినట్లు గానీ తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
– మహ్మద్‌ యాసిన్‌ ఖురేషి, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top