‘తమ్ముడిని బాగా చూసుకోండి..హాస్టల్లో మాత్రం చేర్పించకండి’

‘తమ్ముడిని బాగా చూసుకోండి..హాస్టల్లో మాత్రం చేర్పించకండి’ - Sakshi

♦ వ్యవసాయ పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య

 

సంగారెడ్డి: హస్టల్లో ఉండటం ఇష్టం లేని ఓ విద్యార్థిని హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్‌ గ్రామ పంచాయతీ రత్నపురి వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి గ్రామానికి చెందిన అనకాపల్లి రాజశేఖర్, అరవింద దంపతుల కుమార్తె సహస్ర (17)ను రత్నపురి పాలిటెక్నిక్‌ కళాశాలలో సెకండియర్‌ చదువుతోంది.

 

కొద్ది నెలల నుంచి కళాశాలలో సీనియర్‌ విద్యార్థినులు ఇబ్బందులు పెడుతున్నారని సహస్ర తండ్రి రాజశేఖర్‌కు చెప్పింది. దీంతో 15 రోజుల క్రితం రాజశేఖర్‌ కళాశాల ఏఓ భిక్షపతితో మాట్లాడారు. హాస్టల్‌లో మహిళా వార్డెన్‌ లేకపోవడంతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో విద్యార్థి సహస్ర ఆదివారం అర్థరాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

 

సహస్ర మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ లభించింది. ‘ఈ కళాశాల నచ్చడం లేదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే స్నేహితులు లేరు. ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్తుదామంటే.. ఫ్యామిలీ ఇబ్బందులు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్న. వీలైతే నన్ను క్షమించండి. తమ్ముడిని బాగా చూసుకోండి. వాడిని మాత్రం హాస్టల్‌లో వేయకండి’అంటూ సూసైడ్‌ నోట్‌ రాసింది. కళాశాల యాజమాన్యం, ఏఓ భిక్షపతి వేధింపులే తన కుతూరు ఆత్మహత్యకు కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top