కన్నతండ్రిపై బిడ్డల పోరు
- అన్యాయం చేశారని ఆరోపణ
- ఇంటిముందు ఆందోళన
- న్యాయం చేయాలని డిమాండ్
కామారెడ్డి క్రైం(కామారెడ్డి): ‘‘మా నాన్న వేధింపులు భరించలేకే అమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు తెలియకుండా ఇల్లు అమ్మి ఎక్కడికో పారిపోయాడు. న్యాయం చేయండి’’ అంటూ బిడ్డలు పోరుబాట పట్టారు. తండ్రి ఇంటి ముందు నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్నగర్కాలనీకి చెందిన అక్కల శోభన్ గౌడ్ ఫైనాన్స్, చిటీల వ్యాపారం చేసేవాడు. ఆయనకు కుమారుడు నిఖిల్గౌడ్, కూతురు నిఖిత ఉన్నారు.
శోభన్గౌడ్ మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. నిఖిల్గౌడ్, నిఖిత హైదరాబాద్లోని హాస్టల్లో ఉండి చదు వుకుంటున్నారు. వారు రెండు రోజుల క్రితం కామారెడ్డికి వచ్చారు. ఇల్లు ఖాళీ చేసి ఉంది. ఇంటిని అమ్మేశారని తెలియడంతో అవాక్కయ్యారు. న్యాయం చేయాలని బుధవారం ఆందోళనకు దిగారు. విద్యానగర్ కాలనీలోని ఇల్లు, తమ తల్లికి చెందిన బంగారు నగలు, బ్యాంకులోని డబ్బులను తండ్రి తీసుకున్నాడని, ఇప్పుడు ఇల్లు కూడా అమ్ముకున్నాడని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తండ్రి తమ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. తాము రోడ్డుపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ముందు టెంట్ వేసుకుని, గేటుకు ఫ్లెక్సీ కట్టి నిరసన తెలిపారు. న్యాయం జరిగేలా చూడాలని కోరారు.