రేపటి నుంచి అంతర్జాతీయ విత్తన సదస్సు
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి జూలై 3 వరకు 32వ అంతర్జాతీయ విత్తన సదస్సును (32 ఇస్టా కాంగ్రెస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సీడ్ బౌల్ గా చూడాలన్న ఆశయంతో సీఎం కేసీఆర్ వినూత్న మార్పులతో దేశంలో రాష్ట్రాన్ని విత్తన కేంద్రంగా మార్చారని పేర్కొన్నారు. హైటెక్స్లో జరిగే ఈ ఇస్టా కాంగ్రెస్ సదస్సుతో తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయంగా వెలుగొందడం ఖాయమన్నారు. ఈ మేరకు సోమవారం రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిసి ఈనెల 28న జరిగే ముగింపు సదస్సుకు రావాలని మంత్రి ఆహ్వానించారు.