ఒకే కుటుంబంలో 19 మందికి వైరస్‌

19 people in the same family got Corona virus - Sakshi

సంగారెడ్డి జిల్లాలో మహమ్మారి పంజా  

తాజాగా 22 మందికి పాజిటివ్‌ 

సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డి జిల్లాపై కరోనా పంజా విసిరింది. పక్షం రోజుల్లో 50 మంది కరోనా బారిన పడ్డారు. రోజు రోజుకూ విస్తరిస్తూ వణుకు పుట్టిస్తోంది. శనివారం ఒక్కరోజే జిల్లాలో 22 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జహీరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి, అమీన్‌పూర్‌లో ఇద్దరికి, రాయికోడ్‌ మండలం హుల్గేరాలో ఒకరికి ఈ మహమ్మారి సోకింది. దీంతో జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తమైంది. 

జాగ్రత్తలు తీసుకుని ఉంటే...: జహీరాబాద్‌లోని శాంతినగర్‌కు చెందిన ఓ మహిళ (55) గుండె సంబంధిత సమస్యతో ఈనెల 8న హైదరాబాద్‌లోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ గత మంగళవారం మరణించింది. ఆ మహిళ మృతదేహం నుంచి శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఫలితాలు రాకముందే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయడంతో వారు అదేరోజు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు జాగ్రత్తలు పాటించకుండా అంత్యక్రియల్లో పాల్గొనడంతో ఏకంగా 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా రిపోర్టు ముందుగానే వచ్చి ఉంటే కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకుని ఉండేవారని ఫలితాల ఆలస్యమే కొంపముంచిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఎవరెవర్ని కలిశారో ఆరా తీస్తున్నాం 
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 22 మంది ఈ రెండు రోజుల్లో ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో వివరాలు సేకరిస్తున్నాం. జహీరాబాద్, అమీన్‌పూర్, హల్గేరాలో వైద్య ఆరోగ్య సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. ఎవరికైనా దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్య ఉంటే వెంటనే జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్‌ 19 వార్డుకు రావొచ్చు. వారి శాంపిల్స్‌ సేకరించి హైదరాబాద్‌ పంపిస్తాం. కరోనా పట్ల జాగ్రత్త, అప్రమత్తతే ముఖ్యం. ఎక్కువ మంది ఉండే చోట తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.  
– మోజీరాం రాథోడ్, డీఎంహెచ్‌ఓ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top