త్వరలో 108 బైక్ సర్వీసు..
సాక్షి, హైదరాబాద్ : నగర గల్లీల్లోకి ప్రస్తుతం ఉన్న అంబులెన్సులు వేగంగా చేరుకోవడంలేదు. ప్రమాదం ఏదైనా.. తక్షణం ప్రథమ చికిత్స అందితేనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. క్షతగాత్రులకు, రోగులకు అత్యంత వేగంగా వైద్య సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 108 బైక్ సర్వీసును ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుత అంబులెన్సులు వెళ్లలేని కాలనీలకు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో వేగంగా ప్రమాదస్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించేందుకు ఈ బైక్లను అందుబాటులోకి తెస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు 108 బైక్లను 50 సిద్ధం చేశారు. ఈ వాహనాలను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నది. ప్రథమ చికిత్స, వైద్య నైపుణ్యాలు కలిగిన వ్యక్తిని ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్సు ఉద్యోగిగా నియమించి 108 సేవలకు వినియోగించనున్నారు. రూ.లక్ష ఖర్చుతో ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్సు వాహనం, మెడికల్ కిట్ను ఏర్పాటు చేశారు. రూ.50 లక్షలతో మొత్తం 50 వాహనాలను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తున్నారు. ఫస్ట్ రెస్పాండర్ అంబులెన్సు నిర్వహణకు ఒక్కో వాహనానికి నెలకు రూ.35 వేల వరకు ఖర్చు చేయనున్నారు.