పరిశ్రమలకు 10 శాతం కాళేశ్వరం నీరు

10 percent Kaleswara water for industries - Sakshi

పారిశ్రామికవేత్తలు ఇక్కడే పెట్టుబడులు పెట్టాలి:   మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట జోన్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నీటి వాటాలో పది శాతం పరిశ్రమలకు కేటాయిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వ్యాపారులు నిర్వహించిన ఆత్మీయ పరిచయ వేదిక (ములాఖత్‌) కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిందని, ఇందులో భాగంగా విధి విధానాలను సులభతరం చేసిందని చెప్పారు.

365 రోజులు ప్రతి పరిశ్రమకు నీటి వసతిని కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పరిశ్రమల పురోగతికి కావాల్సిన రోడ్డు రవాణా, రైల్వేలైన్, నీరు, విద్యుత్‌ సదుపాయాలు ముఖ్యమని, వాటిని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటికే రూ.1100 కోట్లతో రైల్వేలైన్, రూ.750 కోట్లతో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయని ఆయన వివరించారు. పారిశ్రామిక వేత్తలు ఇక్కడే పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఏడాదిలోగా గోదావరి జలాలు తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  

సిద్దిపేటలో ఇండస్ట్రియల్‌ పార్కు
సిద్దిపేట ప్రాంతంలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి చెప్పారు. ములుగు శివారులో విత్తనాల కంపెనీ, బెజ్జంకి శివారులో గ్రానైట్‌ కంపెనీ, ,దుద్దెడ శివారులో రూ.900 కోట్లతో మొబైల్‌ విడి సామగ్రి తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని హరీశ్‌ వివరించారు. అలాగే..200 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top