కోర్టు తీర్పునకు ముందే ఏనుగు మృతి
సేలం (తమిళనాడు) : కారుణ్య మరణం కేసుపై కోర్టు తీర్పు వెలువడక మునుపే తమిళ నాడులోని సేలం సుగవనేశ్వరర్ ఆలయ ఏనుగు రాజేశ్వరి శనివారం ప్రాణాలు కోల్పో యింది. 1981లో ముదుమలై అభయారణ్యం నుంచి ఐదేళ్ల వయస్సున్న ఏనుగును ఆలయానికి తీసుకొచ్చి రాజేశ్వరి అని పేరు పెట్టారు. 42 ఏళ్ల రాజేశ్వరికి పదేళ్ల కిందట టీబీ సోకడంతో వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్వరిని పునరావాస శిబిరానికి తరలిస్తున్న సమయంలో వాహనంపై నుంచి కిందకి దూకడంతో కాలు విరిగింది. ఈ స్థితిలో మార్చి 5న కూలబడిన ఏనుగుకు వైద్యులు చికిత్స అందించినా నిలబడలేక పోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఏనుగుకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలని మురళీధరన్ అనే వ్యక్తి చెన్నై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ 16న ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి అబ్దుల్ కుతూస్ సమక్షంలో విచారణకొచ్చింది. ఏనుగు కారుణ్య మరణానికి న్యాయ మూర్తులు ఉత్తర్వులిచ్చారు. ప్రత్యేక వైద్య బృందం ఏనుగు ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిక అందిన స్థితిలో కారుణ్య మరణంపై కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉండగా శనివారం ఏనుగు సహజ మరణం పొందింది.
మరిన్ని వార్తలు