తండ్రిని కూడా హతమార్చాలనుకున్నా!
కిరాతకుడు దశ్వంత్
చెన్నై(టీ.నగర్) : తండ్రిని కూడా హత్య చేయాలనుకున్నానని, కిరాతకుడు దశ్వంత్ చెన్నైలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. చెన్నైలో హాసిని అనే ఎనిమిదేళ్ల బాలికను, కన్నతల్లిని కిరాతకంగా హత్యచేసి ముంబైకు పారిపోయిన దశ్వంత్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముంబై కోర్టులో దశ్వంత్ను హాజరుపరిచి శనివారం రాత్రి 9 గంటల సమయంలో ముంబై నుంచి చెన్నైకి విమానంలో తీసుకువచ్చారు. ఆ తర్వాత అతన్ని రాత్రి 10.30 గంటలకు కుండ్రత్తూరు పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడ దశ్వంత్ పోలీసులు విచారించారు. ఇలావుండగా ఆదివారం శ్రీపెరంబుదూరు కోర్టుకు సెలవు కావడంతో చెంగల్పట్లులోగల మేజిస్ట్రేట్ ఇంటిలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు దశ్వంత్ను పోలీసులు హాజరుపరిచి జైలులో నిర్బంధించారు.
ముందుగా ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మాంగాడు సమీపానగల ముగిలివాక్కంలో చిన్నారి హాసిని (6)పై గత ఫిబ్రవరి 5న అత్యాచారం జరిపి హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో తనను పోలీసులు అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారని, తర్వాత బెయిలుపై విడుదలయిన తనను తల్లిదండ్రులు రోజూ తిడుతూ ఉండేవారని తెలిపాడు. తన విలాస జీవితానికి డబ్బు అవసరం కావడంతో తండ్రిని ప్రతిరోజు రెండు వేల రూపాయలు ఇవ్వమని కోరానని, దీనికి ఆయన నిరాకరించడంతో హతమార్చేందుకు పథకం వేసినట్లు తెలిపాడు. తన తల్లిని హతమార్చిన రోజు తండ్రి తొందరగా పనికి వెళ్లడంతో తప్పించుకున్నాడని పేర్కొన్నాడు. కాగా, హాసిని హత్య కేసుకు సంబంధించిన తీర్పు జనవరిలో రానున్నట్లు సమాచారం.