భర్తను కడతేర్చిన భార్య


చెన్నై‌:

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను బండరాయితో కొట్టి భార్య హతమార్చింది. ఆమెను, ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన అవినాశి సమీపంలో చోటుచేసుకుంది. తిరుప్పూరు జిల్లా పెరుమానల్లూరు పంచాయతీ మరియాపురానికి చెందిన కేశవన్‌ (31) కార్మికుడు. ఇతని భార్య కీర్తిక (27). ఈ దంపతులకు ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. వీరి ఇంటి సమీపంలో మదియళగన్‌ (30) అనే కట్టడ కార్మికుడు నివసిస్తున్నాడు.



ఇతను అవివాహితుడు. కేశవన్, మదియళగన్‌ వృత్తిరీత్యా స్నేహితులు. ఈ నేపథ్యంలో మదియళగన్, కీర్తిక మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రెండు రోజుల క్రితం పని ముగించుకుని కేశవన్‌ రాత్రి ఇంటికి రాగా మదియళగన్, కీర్తిక ఇంట్లో చనువుగా ఉండడం చూశాడు. ఆగ్రహించిన కేశవన్, భార్య, మదియళగన్‌పై దాడి చేశాడు. కొద్ది సేపట్లో మదియళగన్, కేశవన్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ తరువాత ఇంట్లో కేశవన్‌ నిద్రించాడు. అర్ధరాత్రి మళ్లీ కేశవన్‌ ఇంట్లోకి ప్రవేశించిన మదియళగన్‌ ప్రియురాలి కీర్తికతో కలిసి  నిద్రిస్తున్న కేశవన్‌ తలపై బండరాయి వేశారు. కేశవన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పెరుమానల్లూరు పోలీసులు మదియళగన్‌ను, కీర్తికను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top