ప్రియురాలి కోసం వెళ్లి.. వైరస్ బారిన పడ్డాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: లాక్డౌన్ సమయంలో ప్రియురాలిని కలుసుకునేందుకు తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు వెళ్లిన యువకుడికి కరోనా వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యాడు. తమిళనాడు, తిరుపత్తూరు జిల్లా ఆంబూరులో చెప్పుల షాపు నడుపుతున్న చెందిన 25 ఏళ్ల యువకుడికి చిత్తూరు గిరింపేటకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉంది. ఆమె కోసం తరచూ చిత్తూరుకు వెళ్లివస్తుండేవాడు. లాక్డౌన్ కారణంగా రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆంబూరు నుంచి చిత్తూరు జిల్లా పలమనేరుకు కూరగాయాల లారీలో వెళ్లి అక్కడి నుంచి ఓ ప్రైవేటు బ్యాటరీ కంపెనీ లారీలో తిరిగొస్తుంటాడు.
వారం రోజుల క్రితం అతను ప్రయాణించిన లారీని చిత్తూరు జిల్లా ఆరోగ్యశాఖాధికారులు తనిఖీ చేసి అందులోని 20 మందిని క్వారంటైన్లో పెట్టారు. అంబూరుకు చెందిన యువకునికి వైరస్ నిర్ధారణ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపత్తూరు ఆరోగ్యశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అంబూరులో యువకుడు నివసిస్తున్న ప్రాంతానికి సీలు వేశారు. అతనితో ప్రయాణించిన కూరగాయల వ్యాపారులు, బ్యాటరీ కంపెనీ సిబ్బంది సహా 220 మందికి ఈ నెల 12న రెండు రాష్ట్రాల ఆరోగ్యశాఖ సిబ్బంది వైద్యపరీక్షలు చేశారు. ఫలితాలు రావాల్సి ఉంది.
సంబంధిత వార్తలు