మా మాస్టారే రావాలి..
చెన్నై , సేలం: తమకు కొత్త మాస్టారు వద్దని, తమ మాస్టారే కావాలని విద్యార్థులు సోమవారం తిరుచెంగోడులో ఆందోళన చేపట్టారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో మున్సిపల్ మిడిల్ స్కూల్ ఉంది. ఇక్కడ పార్తిబన్ ఇంగ్లీషు మాస్టార్గా పని చేస్తున్నాడు. జాక్టో జియో ఆందోళనలో పాల్గొనడంతో అరెస్టయ్యి జైలుకు వెళ్లాడు, అనంతరం వేరే పాఠశాలకు బదిలీ అయ్యాడు. సోమవారం వేరే ఉపాధ్యాయులు వస్తారని విద్యార్థులకు తెలిసింది. దీంతో విద్యార్థులు సోమవారం ఉదయం పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కొత్త మాస్టారు వద్దని పార్తిబన్ ఉపాధ్యాయుడిగా రావాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, విద్యాధికారులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పి తరగతులకు పంపించారు.