కోర్టుకు హక్కులేదు


విద్యుత్ బోర్డు నియంత్రణ కమిషన్ వ్యాఖ్య

 అక్రమాలు సాగుతున్నాయన్న పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు

 

 చెన్నై, సాక్షి ప్రతినిధి:విద్యుత్ బోర్డు పరిధిలో ఉన్న వినియోగం సరఫరా హక్కును హరించే అధికారం న్యాయస్థానానికి లేదని తమిళనాడు విద్యుత్ నియంత్రణ కమిషన్ మద్రాసు హైకోర్టులో స్పష్టం చేసింది. విద్యుత్ కోనుగోళ్లలో విరివిగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చెన్నై ఉల్లరత్తకు చెందిన సి శెల్వరాజ్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాదించారు. పిటిషనర్‌దారు దాఖలు చేసిన వ్యాజ్యంలోని వివరాలు ఇలా ఉన్నాయి. 2003లో పార్లమెంటులో కొత్త విద్యుత్ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం కింద తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా బోర్డు ఏర్పాటై ఆయా పనులను నిర్వహిస్తున్నాయి.

 

  ఆ తరువాత ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే విద్యుత్ ఉత్పత్తి సంస్థలను మూసివేసి, నిషేధం విధించారు. ప్రయివేటు విద్యుత్ సంస్థలకు అనుమతులు మంజూరు చేసి హెచ్చుధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఒక యూనిట్‌ను రూ.3 ఖర్చుతో ఉత్పత్తి చేసే అవకాశం ఉండగా రూ.15  చెల్లించి ప్రయివేటు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒక యూనిట్‌కు రూ.12 అదనపు భారం పడుతుండగా, ఇదే అదనుగా ప్రభుత్వాధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. విద్యుత్ కొనుగోలులో చోటుచేసుకున్న అక్రమాల వల్ల ప్రభుత్వానికి గత కొన్నేళ్లలో రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లింది. విద్యుత్ కొనుగోలులో దోపిడీపై ప్రత్యేక విచారణకు ఆదేశించాలని వాజ్యంలో కోర్టును కోరారు. ఈ పిల్‌పై విద్యుత్ కమిషన్ స్పందిస్తూ నిజాయితీ అధికారులపై ఉద్దేశ్యపూర్వకంగా అపనిందలు వేశారని గతంలో కోర్టుకు బదులిచ్చింది.

 

  ఈ వ్యాజ్యం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి శివజ్ఞానం ముందుకు రాగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సోమయాజీ, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అబ్దుల్ సలీమ్ కోర్టుకు హాజరై పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు అర్హతలేని ఈ వ్యాజ్యాన్ని ఆరంభంలోనే కొట్టివేయాలని అన్నారు. పిటిషన్‌దారుడు విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు ముందుగా ఫిర్యాదు చేయకుండా నేరుగా కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశాడని తెలిపారు. విద్యుత్ కమిషన్, విద్యుత్ బోర్డును రద్దుచేసే అధికారం విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు మాత్రమే ఉంది, కోర్టుకు లేదని వారు తమ వాదనలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 2.5 కోట్ల ప్రజానీకానికి కమిషన్ ద్వారానే విద్యుత్ సరఫరా సాగుతోందని చెప్పారు.

 

  విద్యుత్ కొనుగోలు, సరఫరా, చార్జీల నిర్ణయం అంతా విద్యుత్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుందని చెప్పారు. కమిషన్ ఏర్పడిన తరువాతనే విద్యుత్ బోర్డు లాభాల బాట పట్టిందని వివరించారు. దుర్బుద్దితో వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని న్యాయవాదులు కోరగా, జూలై 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ప్రయివేటు విద్యుత్ కొనుగోలులో అక్రమాల ఆరోపణలపై  మద్రాసు హైకోర్టులో విచారణ సాగుతున్న దశలో తూత్తుకూడి జిల్లా ఉడన్‌కుడి విద్యుత్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ కొనుగోలు టెండర్ల నిబంధనల్లో తాజాగా మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం.

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top