17 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఖైదీ అరెస్ట్
చెన్నై(కేకేనగర్):
తండ్రి, అవ్వను హత్య చేసిన కేసులో జైలు నుంచి పెరోల్పై బయటకు వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిన జీవిత ఖైదీ 17 ఏళ్ల తర్వాత తిరిగి అరెస్టు అయ్యాడు. తిరువన్నామలై జిల్లా ఆరణి సమీపంలోని అడైపులం గ్రామానికి చెందిన శేఖర్ పనికి వెళ్లకపోవడంతో ఆయన తండ్రి వేల్మురుగన్, అవ్వ కన్నమ్మాల్ నిలదీశారు. దీంతో ఆగ్రహించిన శేఖర్ 1994లో ఇద్దరిపై రాయివేసి దారుణంగా హత్య చేశాడు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి శేఖర్ను అరెస్టు చేశారు. కేసును విచారించిన తిరువన్నామలై సిట్టింగ్ బెంచ్ 1996లో శేఖర్కు జీవిత ఖైదు విధించింది. వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష పొందుతున్న అతను భార్య శాంతిని చూడాలని 1999 డిసెంబర్ 11న ఐదు రోజులు పెరోల్పై బయటకు వచ్చాడు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ స్థితిలో వే లూరు జిల్లా లత్తేరి సమీపంలోని కరస మంగళం గ్రామంలోని భారతి నగర్లో శేఖర్(60)ను పోలీసులు సోమవారం అరెస్టు చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి వేలూరు జైలుకు తరలించారు.