సీపీఎం నేత హత్య
టీనగర్: చెంగల్పట్టులో సీపీఎం నేత కిడ్నాపై హత్యకు గురయ్యాడు. చెంగల్పట్టు ఎన్జీవో నగర్ సమీపంలోగల కేకే నగర్ మహాత్మాగాంధీ వీధికి చెందిన సెల్వం (50) కట్టడ మేస్త్రీ. ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాలను కాంట్రాక్టు తీసుకుని నిర్మిస్తుంటారు. సీపీఎం పార్టీకి చెందిన ఇతను ఆ సంఘం భవన నిర్మాణ కార్మికుల విభాగం కేకేనగర్ నిర్వాహకునిగా వుంటూ ఉచ్చారు. ఇతనికి ఎలిజబెత్ రాణి అనే భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎలిజబెత్ రాణి ఇంట్లో కిరాణా దుకాణం నడుపుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సెల్వం పశువుల దాణా కొనుగోలు చేసేందుకు బైక్లో దుకాణానికి వెళ్లాడు. అతని వద్ద పనిచేసే యువకుడు సురేష్ మోటార్ సైకిల్ నడుపుతుండగా సెల్వం వెనుకవైపు కూర్చున్నాడు.
పాత జీఎస్టీ రోడ్డులోగల ఆంకాళమ్మన్ ఆలయం వద్ద వెళుతుండగా ఆటోలో దిగిన ముగ్గురు వ్యక్తులు సెల్వం బైకును అడ్డగించారు. వారు సెల్వంపై దాడి చేసి ఆటోలో కిడ్నాప్ చేశారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన సురేష్ వెంటనే సెల్వం భార్య ఎలిజబెత్ రాణికి సమాచారం తెలిపాడు. వీరిరువురూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో సిరుమణికి చెందిన జైరాజ్, కేకే నగర్కు చెందిన దీనా అలియాస్ దినకరన్, వినోద్ అనే ముగ్గురు కలిసి సెల్వంను కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈ ముగ్గురూ ఆటో డ్రైవర్లు. సురేష్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దీనా అలియాస్ దినకరన్ను శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద విచారణ జరపగా పాతకక్షల కారణంగా సెల్వం కిడ్నప్నకు గురైనట్లు తెలిసింది. కిడ్నాప్నకు గురైన సెల్వం చెంగల్పట్టు సమీపంలోగల తిరుమణిగై కండ్రిగ ప్రాంతంలో శవంగా లభించాడు. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.