దంపతుల ఆత్మహత్య

Couple suicide in Chennai - Sakshi

చదువుకోవడానికి భర్త అంగీకరించలేదని భార్య..

 భార్య మృతి కేసు భయంతో భర్త బలవన్మరణం..

అన్నానగర్‌: కళాశాలకు వెళ్లేందుకు భర్త అంగీకరించకపోవడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భయపడి భర్త విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పళని సమీపంలో జరిగింది. పళణి సమీపం తొప్పంపట్టి అప్పునూత్తుకి చెందిన నాట్టుదురై కుమారుడు తంగరాజ్‌ అలియాస్‌ నటరాజ్‌(35) రైతు. ఇతను అదే ప్రాంతానికి చెందిన గౌతమిని(22) ప్రేమించి ఏడాదిన్నర కిందట వివాహం చేసుకున్నాడు. తరువాత నటరాజ్, తండ్రి ఇంటి సమీపంలో ఉన్న ఫామ్‌ హౌస్‌లో భార్యతో కాపురం చేస్తూ వచ్చాడు. వీరికి నవనీస్‌ అనే ఐదు నెలల మగబిడ్డ ఉన్నాడు. గౌతమి పళనిలో ఉన్న ఓ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది.

 ఈ క్రమంలో ఆమెకు తరచూ కళాశాలకు వెళ్లి చదవాలని కోరిక ఉండేది. ఇందుకు భర్త అనుమతి కోరింది. భర్త అంగీకరించకపోవడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో విరక్తి చెందిన గౌతమి శుక్రవారం ఇంట్లో విషం తాగింది. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన నటరాజ్‌ భయపడి తానూ విషం తాగాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన నటరాజ్‌ కన్నవారు, బంధువులు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి ఇద్దరిని తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని పళని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నటరాజ్, గౌతమి ఇద్దరు మృతిచెందారు. కీరనూర్‌ పోలీసులు కేసు విచారణ జరిపారు. విచారణలో గౌతమి విషం తాగడంతో పోలీసులు  అరెస్టు చేస్తారనే భయంతో నటరాజ్‌ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top