కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: మల్లు రవి
హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగ చేశామంటున్న కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కేసీఆరే వ్యవసాయాన్ని దండగ చేశాడన్నారు. మార్కెట్లకు హాలిడే ప్రకటిస్తున్న దుస్థితి నెలకొందని, మద్దతు ధర లేక రైతులు మిర్చి, కందులను పారబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీసం పరామర్శించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, సర్కార్ కళ్ళు ఉండి చూడలేని దుస్థితిలో ఉందని అన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇస్తేనే రైతులకు ఊరట కలుగుతుందని సూచించారు. టీఆర్ఎస్ కూలి పనులు హాస్యాస్పదంగా ఉన్నాయని, నిజమైన కూలీని వారు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.