‘చిన్నారుల పార్లమెంట్’కు కనక
కర్ణాటక ప్రతినిధిగా ఎంపిక
బాలల సమస్యపై గళం
విప్పనున్న కన్నడ బాలిక
సాక్షి, బెంగళూరు: యూనిసెఫ్ ఆధ్వర్యంలో లోక్సభలో జరగనున్న ‘చిన్నారుల పార్లమెంట్’ కార్యక్రమానికి కర్ణాటక ప్రతినిధిగా నగరానికి చెందిన కనక (16) ఎంపికైంది. ప్రతి ఏడాది బాలల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈ కార్యక్రమం ఈనెల 20న లోక్సభలో జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ఎంపికైన బాలలు, చిన్నారుల పార్లమెంట్లో బాలలు ఎదుర్కొనే సమస్యలు, అందుకు సంబంధించిన పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. కాగా, స్పర్శ్ సంస్థ తరఫున కనక పేరును ప్రస్తావించిన ట్రస్ట్ ఎండీ గోపినాథ్ శుక్రవారం మాట్లాడుతూ....‘కనక, బెంగళూరు నగరంలోని రాజాజీనగరలో నివసించేవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు.
ఉపాధి కోసం పనులు చేసుకుంటూ గడిపేది. మా సంస్థ తరఫున నగరంలో బాలకార్మిక వ్యవస్థపై సమీక్ష జరిపే సమయంలో మేం కనకను గుర్తించాం. ఆ సమయంలో తనకు చదువుపై ఆసక్తి ఉందని తెలుసుకున్నాం. అనంతరం మా సంస్థ నుండి అందించిన సహకారంతో ప్రస్తుతం బీజీఎస్ పీయూ కళాశాలలో చదువుకుంటూ నృత్యకారిణిగా రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె చిన్నారుల పార్లమెంట్కు ఎంపికైంది. ఆ సదస్సులో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దౌర్జన్యాల గురించి ప్రసంగించనున్నారు’ అని వెల్లడించారు.