ఊపిరాడటం లేదు, సాయం చేయండి
బెంగళూరు: ఆ తల్లీబిడ్డలు నిరుపేదలు.. లాక్డౌన్ కాలంలో పూట గడవడానికే కష్టంగా ఉన్న వారికి కరోనా సోకింది. సాయం చేయండంటూ చేతులెత్తి మొక్కినా, ఆర్తనాదాలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కన్నీళ్లుపెట్టుకుంటూ సోషల్ మీడియాలో గోడును వెళ్లబోసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని హెబ్బల్కు చెందిన 28 ఏళ్ల వీనా కుమారి, ఆమె తల్లి సిద్ధ లక్ష్మి కరోనా బారిన పడ్డారు. అయితే చికిత్స కోసం వారు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. వైరస్ సోకిన రెండు రోజుల వరకు కూడా వారిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రాలేదు.
మరోవైపు తల్లి పరిస్థితి బాగా లేకపోవడంతో వీణ తాము పడుతున్న బాధలను వీడియోలో వెల్లడించింది. "మా అమ్మకు బీపీ, షుగర్ ఉంది. నా మాటలు కూడా ఆమెకు వినపడం లేదు. రెండు రోజులుగా బెంగళూరు మహానగర పాలిక్(బీబీఎంపీ) అధికారులకు, 108కు ఫోన్లు చేస్తూనే ఉన్నాం. కానీ ఏదైనా ఆస్పత్రిలో బెడ్ దొరికినట్లు డాక్టర్లు రాసిచ్చిన పత్రం ఉంటేనే వస్తామంటున్నారు. మాకు ఎవరూ పెద్దగా తెలీదు, డబ్బులు కూడా లేవు" అని కన్నీళ్లు పెట్టుకుంది. (10 వేల జనాభాకు 8 మందే డాక్టర్లు)
ఈ వీడియో అక్కడి టీవీ చానల్స్లో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో స్పందించిన అధికారులు మంగళవారం మధ్యాహ్నం అంబులెన్స్ను పంపించి కోరమంగళ ఇండోర్ స్టేడియంలో వారిని చేర్పించారు. అయితే ఆ ఆస్పత్రి అత్యంత హీనావస్థలో ఉంది. అక్కడి ఆస్పత్రిలో డాక్టర్లు ఎప్పుడొస్తారో వారికే తెలీదు. కనీస సౌకర్యాలు కూడా లేవు. ఈ విషయాన్ని బాధితురాలి బంధువు జ్ఞానేంద్ర బీబీఎంపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారిని సెయింట్ మార్తా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ బిల్లులను వారు భరించలేరని, గురువారం మరో ఆస్పత్రికి వెళతామని జ్ఞానేంద్ర పేర్కొన్నారు. (ఊపిరి ఆడటం లేదంటూ 50 ఆస్పత్రులు..)