24 గంటలు.. 1,200 గుంతలు

BMC Pothole Challenge, Rs 500 Reward if not Fixed in a Day - Sakshi

ఒక్క రోజులోనే గుంతలు పూడ్చేసిన బీఎంసీ అధికారులు

గుంతలు చూపండి రూ.500 పొందండి పథకానికి అనూహ్య స్పందన

సాక్షి, ముంబై: బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) పరిపాలన విభాగం ప్రవేశపెట్టిన ‘గుంతలు చూపండి–రూ.500 పొందండి’ అనే పథకానికి ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఒక్క రోజులోనే బీఎంసీ యాప్‌కు ఏకంగా 1,700 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 24 గంటల్లోనే 1,200 గుంతలను పూడ్చివేయడంలో బీఎంసీ సఫలీకృతమైంది. కానీ, మిగతా 500 గుంతలను అలాగే గాలికి వదిలేయడంతో ముందుగా ప్రకటించిన ప్రకారం ఒక్కో ఫిర్యాదుదారుడికి రూ.500 బహుమతి సంబంధిత బీఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ చెల్లించాల్సి ఉంటుంది.

ఫిర్యాదులు పట్టించుకోవట్లేదని..
బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) పరిపాలన విభాగం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. నగర రహదారులపై ‘గుంతలు చూపండి–రూ.500 పొందండి’అనే పథకం ప్రారంభించింది. బీఎంసీ యాప్‌పై ఫిర్యాదు నమోదు చేసిన 24 గంటల్లో గుంతను పూడ్చివేయని పక్షంలో సంబంధిత ఫిర్యాదు దారుడుకి రూ.500 చెల్లించనున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని గుంతల రహితంగా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో బీఎంసీ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. నగరంలో ప్రధాన రహదారులు మొదలుకుని చిన్న, చితక గల్లీలో సైతం రోడ్లు పటిష్టంగా ఉండాలని బీఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తుంది. అయినప్పటికీ అక్కడక్కడ గుంతలు ఉన్నాయని ముంబైకర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నారు. దీంతో ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అందులో ఫిర్యాదులు చేయాలని కోరింది.

ఈ క్రమంలో ఆ వెబ్‌సైట్‌లో నిత్యం వందలాది ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఫిర్యాదు అందుకున్న బీఎంసీ సిబ్బంది అక్కడి వెళ్లి గుంతలను పూడ్చివేస్తారు. అయినప్పటికీ అనేక చోట్ల గుంతలు అలాగే ఉన్నాయంటూ ముంబైకర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో బీఎంసీ పరిపాలన విభాగం ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ముంబైకర్లు ఫిర్యాదు చేసిన గుంత కనీసం ఒక అడుగు వెడల్పు, మూడు అంగుళాల లోతు ఉండాలి. అంతేగాకుండా ఆ గుంత బీఎంసీ హద్దులోని రహదారిపై ఉండాలి. ఫిర్యా దు చేసిన 24 గంటల్లో ఆ గంతను పూడ్చని పక్షంలో రూ.500 ఫిర్యాదుదారుడికి చెల్లించనుంది.

కల్తీ కోల్డ్‌ మిక్స్‌ రసాయనాల వాడకం
వర్షా కాలంలో నగర రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు బీఎంసీ రూ.80 కోట్లతో కాంట్రాక్టు ఇచ్చింది. పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించినప్పటికీ రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి.గుంతలను పూడ్చేందుకు కోల్డ్‌ మిక్స్‌కు బదులుగా హాట్‌ మిక్స్‌ రసాయనాలను వాడాలని కార్పొరేటర్లు డిమాండ్‌ చేశారు. కాని బీఎంసీ పరిపాలన విభాగం కోల్డ్‌ మిక్స్‌ రసాయనాలను వినియోగించింది. కల్తీ కోల్డ్‌ మిక్స్‌ వల్ల గుంతల సంఖ్య తగ్గాల్సి ఉంది. కాని తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఫలితంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాకుండా ఫుట్‌పాత్‌లపై ఫేవర్‌ బ్లాక్‌లు వాడొద్దని కార్పొరేటర్లు డిమాండ్‌ చేసినప్పటికీ వాటినే వినియోగిస్తున్నారు. దీంతో బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు బీఎంసీ స్పష్టం చేసింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top