రంజీ ‘పోరు మొదలయ్యేనా’?
యూపీతో హైదరాబాద్ మ్యాచ్ నేటి నుంచే
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని ముంచెత్తే వాన క్రికెట్ మ్యాచ్లకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే నగరంలో తొలి రంజీ పోరు రద్దయింది. తాజాగా మ్యాచ్ ముందు రోజు కురిసిన వర్షంతో శుక్రవారం అంతర్జాతీయ టి20 మ్యాచ్ మజాను నగరవాసులు ఆస్వాదించలేకపోయారు. ఉప్పల్ మైదానం చిత్తడిగా మారడంతో ఆసీస్తో భారత్ టి20 కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి జింఖానాలో హైదరాబాద్... ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్ల మధ్య జరిగే రెండో రౌండ్ రంజీ మ్యాచ్పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే నాలుగు రోజుల ఆట పూర్తిగా సాగకపోయినా... అరకొరగానైనా మ్యాచ్ సాగే అవకాశముంది. అంబటి తిరుపతి రాయుడు సారథ్యంలోని హైదరాబాద్ తన బ్యాటింగ్ బలంతో యూపీ జట్టుపై ప్రతాపం చూపించేందుకు సిద్ధమైంది.
కొల్లా సుమంత్, తన్మయ్ అగర్వాల్, ఆశిష్ రెడ్డి మెరుగైన ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ సంచలనం సిరాజ్ అందుబాటులో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు యూపీని భారత సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా నడిపిస్తున్నాడు. అ„ŠSదీప్ నాథ్, అస్నోరా, అల్మాస్ షౌకత్లు బ్యాటింగ్లో రాణిస్తున్నారు. బౌలింగ్లో భారత వెటరన్ పేసర్ ప్రవీణ్ కుమార్ యూపీ జట్టుకు అదనపు బలం కానుంది. ఏదేమైనా వరుణుడు కరుణిస్తేనే నగరంలో రంజీ ‘పోరు’మొదలవుతుంది.