మేం బతుకుతాం అనుకోలేదు : రోహిత్
ముంబై : టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా చేసిన కొంటె పనికి తాము బతుకుతాం అనుకోలేదని సహచర ఆటగాళ్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు తెలిపారు. అతడితో కలిసి మరోసారి ఎక్కడికీ వెళ్లబోమని కూడా చెప్పారు. ఓ షోలో పాల్గొన్న ఈ ఇద్దరు ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది మొదట్లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసిందే. మ్యాచ్ల మధ్య విరామం దొరకడంతో జడేజాతో కలిసి రోహిత్ శర్మ, రహానేలు తమ భార్యలు రితిక, రాధికతో కలిసి అడవికి వెళ్లారు. అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా గుండెలు అదిరిపోయే ఘటన చోటుచేసుకుంది.
రెండు చిరుత పులులు వారి సమీపంలోకి వచ్చాయి. ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా నిల్చుండిపోయారు. అదే సమయంలో జడేజా వాటిని పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే అవి వారివైపు చూశాయి. అసలే షాక్తో బిక్కచచ్చిపోయిన ఉన్న రోహిత్, రహానేలకు జడేజా తీరుతో చిర్రెత్తుకొచ్చింది. చివరిసారిగా అందరూ దేవుడ్ని తలచుకున్నారు. అయితే, కాసేపటికే చిరుతలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అవి వెళ్లిపోయాక అందరూ జడేజాను దుమ్మెత్తి పోశారు. ‘అడవిలో ఉన్న సంగతి మర్చిపోయి వాటితో ఆటలు ఆడతావా? కొద్దిలో తప్పింది. లేదంటే వాటికి ఆహారం అయిపోయి ఉండేవాళ్లం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, రోహిత్కు అయితే జడేజా కొట్టాలనేంతా కోపం వచ్చిందని, తాజాగా ఈ ఘటనను గుర్తు చేసుకున్న రోహిత్, రహానేలు.. ఇకపై ఎప్పుడూ జడేజాతో బయటకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చారు. గుజరాత్లో కూడా జడేజా ఓ సారి సింహాలతో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడని, అప్పట్లో ఇది వివాదం కూడా అయిందని, అందుకే అతనితో బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెప్పుకొచ్చారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు