అందుకే ఓడిపోయాం: కోహ్లి
గువాహటి: ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్లో ఓటమిపై భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఓటమికి కారణాలపై మాట్లాడుతూ ‘మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నా స్థాయికి తగ్గ బ్యాటింగ్ చేయలేకపోయాం. క్రీజులో కుదురుకొనేందుకు కొద్దిసేపైనా వికెట్లను అంటిపెట్టుకొని ఉండాల్సింది. కానీ అనుకున్న పని చేయలేకపోయాం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మేము గ్రౌండ్లో 120 శాతం కష్టపడాలి. దానికోసం జట్టు మొత్తం కట్టుబడి ఉంది. ఈ రోజు ఆస్ట్రేలియా మాకంటే ఎంతో బాగా ఆడింది. మేము బ్యాటింగ్లో విఫలమయ్యామ’ని అన్నాడు.
నాలుగు ఓవర్లకు 21 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ జాసన్ బెహ్రెన్డార్ఫ్ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఓపెనర్ రోహిత్ శర్మను కోహ్లి వెనకేసుకచ్చాడు. ‘రోహిత్ అత్యుత్తమ స్థాయి ఆటగాడు. సరైన సమయంలో సరైన ప్రాంతంలో షాట్లు కొట్టడం అతనికి సాధ్యం. ఆ క్రెడిట్ అతడికే ఇవ్వాలి. రోహిత్ లైన్ అండ్ లెన్త్ ఆటతీరు మమ్మల్ని ఆలోచింప చేస్తుంద’ని అన్నాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. అనుకున్న ప్రణాళికను సరిగ్గా అమలు చేయడం ద్వారా విజయం సాధించామని చెప్పుకొచ్చాడు. బెహ్రెన్డార్ఫ్ బంతితో బౌన్స్ను రాబట్టగలిగాడని, చంపా అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు. హెన్రిక్స్ సన్రైసర్స్ తరపున ఆడినప్పటి నుంచి మైదానంలో మంచి ప్రతిభ కనపరుస్తున్నాడని పొగిడాడు. ప్రారంభంలో పిచ్ ఇంగ్లండ్ తరహా పిచ్ను పోలివుందన్నాడు. సిరీస్ ఎవరిదో తేల్చే చివరి మ్యాచ్ శుక్రవారం హైదరాబాద్లో జరుగుతుండటంలో, హైదరాబాద్ అభిమానులు తమకు మద్దతునిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు