బ్యానర్ పట్టుకుని తిరగలేను కదా: కోహ్లి
మెల్బోర్న్: తన గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నారో అనేది అనవసరమని అంటున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. అదే సమయంలో తానెవరో అందరికీ తెలిసేలా బ్యానర్ పట్టుకుని తిరగలేనన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం మెల్ బోర్న్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం కోహ్లి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మైదానంలో తన వ్యవహారశైలిపై విమర్శల ప్రస్తావనను విలేకర్లు తీసుకొచ్చారు. దాంతో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లి.. తనను విమర్శించే వారి కోసం తాను బ్యానర్ పట్టుకుని తిరగలేనని సమాధానమిచ్చాడు.
‘నేను ఏం చేస్తున్నాను? ఎలా ఆలోచిస్తున్నాను? అనే విషయాల్ని అందరికీ తెలిసేలా నేను బ్యానర్ పట్టుకుని తిరగలేను. అదేవిధంగా నన్ను ఇలా ఇష్టపడండి అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే, అవి ఆ విమర్శలన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలు. వాటిని నేను నియంత్రించలేను. ప్రస్తుతం నా దృష్టి అంతా మెల్బోర్న్ టెస్టులో జట్టుని గెలిపించడంపైనే ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే నాపై వచ్చే వార్తలు, విమర్శలు గురించి నేను పెద్దగా పట్టించుకోను, అసలు వాటి గురించే నాకు తెలియదు. అయితే ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. బయట ప్రపంచం నా గురించి ఏమనుకుంటుందో అనేది నాకు అనవరసరం’అని కోహ్లి తెలిపాడు.
సంబంధిత వార్తలు